ఆర్డీఎస్‌ఎస్‌తో డిస్కంల అభివృద్ధి

13 Mar, 2023 03:31 IST|Sakshi

ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగ­దారులకు ప్రపంచస్థాయి సేవ­లు అందించేలా విద్యు­త్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లను పునరుద్ధరణ పంపిణీరంగ పథకం (ఆర్డీఎస్‌ఎస్‌) ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు ఇంధనశాఖ ప్రత్యే­క ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ చెప్పారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్ర ప్రభు­త్వం సుమారు రూ.11 వేల కోట్ల పెట్టుబడి పెడు­తోందని తెలిపారు. ఈ మొత్తం పెట్టుబడిలో 60 శాతం కేంద్రం నుంచి గ్రాంట్‌గా పొంద­వచ్చని చెప్పా­రు.

ఆయన ఆది­వారం ఇంధనశాఖ ఆధికారులతో టెలికాన్ఫ­రెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వ­హిం­చారు. ఈ సందర్భంగా మాట్లా­డుతూ ఆర్డీఎస్‌­ఎస్‌ ద్వారా డిస్కంలు బలోపేతం కావడం వల్ల అన్ని­వర్గాల వినియోగ­దారులకు అధిక నాణ్యత గల విద్యుత్‌ను అందించవచ్చనితెలిపారు. విద్యుత్‌ సంస్థ (పవర్‌ యుటిలిటీస్‌)ల ట్రాన్స్‌మిషన్, డిస్ట్రి­బ్యూషన్‌ నష్టా­ల తగ్గింపు, ఇంధన సామర్థ్యం, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు, పంప్డ్‌ హైడ్రో­స్టోరేజి ప్రాజెక్టులు మొదలైన వాటితోసహా అనేక రాష్ట్ర ప్రభుత్వం పథకాలను నవరత్నాల కింద విజయ­వంతంగా అమ­లు చేస్తున్నట్లు వివరించారు.

తద్వారా గత మూడు­నెలల స్వల్ప వ్యవధిలో విద్యుత్‌ సంస్థలు జాతీయస్థాయిలో ఆరు అవార్డులు సాధించాయని చెప్పారు. 9 ­గంటల పగటి­పూట ఉచిత విద్యు­త్‌ సరఫరా­తోపాటు వ్యవసాయానికి సబ్సిడీ రూపంలో రూ.8,400 కోట్లు ఏటా కేటాయిస్తున్నట్లు తెలి­పారు. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌­మీటర్లను అమర్చడం వల్ల డిస్కంలకు, రైతులకు ప్రయోజనమని చెప్పారు.  

ఏ రైతు తమ జేబులోంచి ఒక్కపైసా చెల్లించాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే బిల్లు మొత్తా­న్ని రైతుల ఖాతాలో జమచేస్తుందని చెప్పారు. 16,66,282 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు స్మార్ట్‌మీ­టర్లు బిగించాలని నిర్ణయించగా.. 16,55,988 కనెక్షన్లకు సంబంధించిన రైతులు అంగీకారం తెలి­పారని చెప్పారు.  ఈ సమావేశంలో ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ బి.శ్రీధర్, డిస్కంల సీఎండీలు జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు, ఏపీఎస్‌ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు