‘ప్రజల మనోభావాలకు ముడిపడిన సున్నితమైన అంశం’

12 Sep, 2020 19:26 IST|Sakshi

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు ప్రార్ధనా మందిరాల భద్రత చర్యను పరిశీలించాలని జిల్లా ఎస్పీలకు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన శనివారం అంతర్వేది ఆలయంపై పత్రిక ప్రకటన వెలువరించారు. అంతర్వేది ఆలయంలో ఏళ్ల నాటి చరిత్ర కలిగిన స్వామి వారి రథం అగ్నికి ఆహుతవ్వడం అత్యంత దురదృష్టకరమన్నారు. ఇది జరగకూడని సంఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ వర్గాలకు చెందిన ప్రజల మనోభవాలతో ముడిపడిన సున్నితమైన అంశంగా డీజీపీ పేర్కొన్నారు. ఈ సంఘటనను ఆసరాగా చేసుకొని మతసామర్యానికి ప్రతీకైన ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఆకతాయిలు ఉదేశపూర్వకంగా మతాల మధ్య చిచ్చు పెడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అటువంటి చర్యలను పోలీస్ శాఖ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపెక్షించకూడదని, వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 

అదే విధంగా నిర్వాహకులు ఆంధ్రప్రదేశ్ బహిరంగ ప్రదేశాల భద్రతా చట్టం 2013 ప్రకారం పూర్తి స్థాయిలో దేవాలయాలు, ప్రార్థన మందిరాల పరిసర ప్రాంతాల్లో స్పష్టంగా కనిపించే విధంగా లైట్లు అమర్చి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తమన్నారు. అంతేగాక అగ్నిప్రమాద నియంత్రణ పరికరాలు, దేవాలయాలకు ఫైర్ & ఎలక్ట్రిసిటీ ఆడిట్ నిర్వహించడం, నిరంతరం రక్షణ ఏర్పాట్లను పర్యవేక్షణ చర్యలు చేపట్టే విధంగా అవగాహన కల్పించడంతోపాటు పెట్రోలింగ్‌ను పటిష్టపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే సోషల్ మీడియా పుకార్లపై నిఘా, మత సామరస్యానికి సంబంధించిన విషయాల్లో ప్రజలు పుకార్లు నమ్మకుండా శాంతి భద్రతలకు సహకరించే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని డీజీపీ సూచించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న దేవాలయాలు, ప్రార్థన మందిరాలను జియో ట్యాగింగ్, నిరంతర నిఘా ఉండే విధంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాలని ఎస్పీలను డీజీపీ అప్రమత్తం చేశారు.

మరిన్ని వార్తలు