సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. 

9 Sep, 2020 11:05 IST|Sakshi
స్టేడియం డిజైన్‌ను చూస్తున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ 

త్వరలోనే పూర్తి చేస్తాం: డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌

సాక్షి, శ్రీకాకుళం: జిల్లాకే తలమానికమైన కోడి రామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. కలెక్టర్‌ జె.నివాస్‌తో కలిసి మంగళవారం ఆయన స్టేడియం పనుల ను స్వయంగా పరిశీలించారు. పనుల తీరు తెన్నులను చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాస్‌కుమార్, కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. మైదానం బ్లూప్రింట్, స్టేడియం డిజైన్‌ను పరిశీలించారు. స్టేడియంలో నిర్మితమవుతున్న రెండు ఫోర్లలో పలు ఇండోర్‌ క్రీడాంశాల్లో ఆటలు ఆడేందుకు వీలుగా డిజైన్‌ చేసినట్టు చీఫ్‌ కోచ్‌ వివరించారు.  

ఈ స్థలానికి ఎంతో ప్రత్యేకత ఉంది.. 
కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణానికి ఎంతో ప్రత్యేకత ఉందని డిప్యూటీ సీఎం కృష్ణదాస్‌ అన్నారు. ఇక్కడే ఎంతోమంది క్రీడాకారులు అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో అద్భుతమై న ఫలితాలు సాధించారని గుర్తుచేశారు. తాను కూడా ఓ జాతీయస్థాయి వాలీబాల్‌ క్రీడాకారుడిని కావడంతో క్రీడల లోటుపాట్లు, క్రీడాకారుల సమస్యలు, క్రీడాసంఘాల ఇబ్బందులు తనకు తెలుసునని పేర్కొన్నారు. రాష్ట్ర ఒలింపిక్‌ అ సోసియేషన్‌ అధ్యక్షుని హోదాలో ఎప్పటికప్పుడు క్రీడా సంఘాలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటున్నానని అన్నారు.  

నిధుల రాకలో జాప్యం.. 
కోడి రామ్మూర్తి స్టేడియం పనుల జాప్యంపై కృష్ణదాస్‌ ప్రతిస్పందించారు. రూ.15 కోట్ల నిధులతో స్టేడియం పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. వాస్తవానికి ఇప్పటికే పనులు పూర్తి కావాల్సి ఉందన్నారు. అయితే స్టేడియం రీ డిజైనింగ్, ఉడా నుంచి రావాల్సిన నిధుల జాప్యం వల్ల ప నులు ఆలస్యంగా జరుగుతున్నట్టు గుర్తించినట్టు పేర్కొన్నారు. ఉడా కాస్త సుడాగా మారడంతో నిధులు జాప్యానికి కారణం అయిందన్నారు.  

సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.. 
త్వరలో అన్ని సమస్యలను అధిగమించి, అంతర్జాతీయ హంగులతో పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతులమీదుగా కేఆర్‌ స్టేడియాన్ని ప్రారంభించేందుకు యోచిస్తున్నట్టు కృష్ణదాస్‌ చెప్పారు. త్వరలో క్రీడా సంఘాలతో చర్చించేందుకు భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. తద్వారా క్రీడల అభివృద్ధికి అన్ని క్రీడా సంఘాలను కలుపుకునిపోయేందుకు సరికొత్త కార్యాచరణకు మార్గం ఏర్పడుతుందన్నారు.  

ఒలింపిక్‌ భవన్‌ కోసం రూ.లక్ష అందజేత 
ఒలింపిక్‌ భవన్‌ కోసం ప్రతి జిల్లాకు లక్ష రూపాయలు వ్యక్తిగతంగా అందజేస్తానని గతంలో కృష్ణదాస్‌ హామీ ఇచ్చి ఉన్నారు. ఇచ్చిన హామీ మేరకు మంగళవారం ఒలింపిక్‌ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.సుందరరావు మాస్టారుకి లక్ష రూపాయల నగదును అందజేశారు. కార్యక్రమంలో సెట్‌శ్రీ సీఈఓ జి.శ్రీనివాసరావు, చీఫ్‌ కోచ్‌ శ్రీనివాస్‌కుమార్, పీఈ టీ సంఘ జిల్లా అధ్యక్షుడు ఎంవీ రమణ, హ్యాండ్‌బాల్‌ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు సుంకరి కృష్ణకుమార్, జూడో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మెంటాడ స్వరూప్, వైఎస్సార్‌ సీపీ నా యకులు ఎన్ని ధనుంజయరావు, క్రీడాసంఘాల ప్రతినిధు లు, శాప్‌ డీఎస్‌ఏ కోచ్‌లు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా వారి న్యాయపరమైన డిమాండ్లను వివరిస్తూ కోచ్‌లు డిప్యూటీ సీఎంకు కృష్ణదాస్‌కు వినతిపత్రాలు అందజేశారు.

మరిన్ని వార్తలు