రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కృష్ణదాస్

25 Jul, 2020 11:54 IST|Sakshi

ఆదాయ సర్టిఫికెట్ కాల పరిమితి నాలుగేళ్లు పెంచుతూ తొలి సంతకం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రిగా ధర్మాన కృష్ణదాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇకపై నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేవిధంగా దస్త్రంపై తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ నమ్మకం నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. బియ్యం కార్డు ఉన్న వారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆయన ప్రకటించారు. అర్హులైన వారికి ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. (కలలో కూడా ఊహించలేదు)

భూ సమస్యలు, తగాదాల సత్వర పరిష్కారానికి ఫ్రెండ్లీ రెవెన్యూ వ్యవస్థకు శ్రీకారం చుడతామని తెలిపారు. రాష్ట్రంలో మూడో అతిపెద్ద ఉద్యోగుల శాఖ అయిన రెవెన్యూలో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా పనులు జరిగేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ‘‘బీసీలకు అగ్రతాంబూలం వేసిన దార్శనికుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఉప ముఖ్యమంత్రి పదవి దక్కడం ఉత్తరాంధ్ర బీసీలకు, శ్రీకాకుళం జిల్లా ప్రజలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. రెవెన్యూ కార్యాలయాల ద్వారా అందే సేవలు గ్రామ, వార్డు సచివాలయల ద్వారా ప్రజలకు సత్వరమే అందేలా చర్యలు తీసుకుంటాం. రాష్ట్రం మొత్తం భూమిని రీ సర్వే నిర్వహించి రికార్డులను నవీకరించనునట్లు’’ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. (కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు)

మరిన్ని వార్తలు