బీసీలకు సీఎం జగన్‌ మాత్రమే న్యాయం చేశారు: మంత్రి ధర్మాన

19 May, 2022 18:08 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 26 నుంచి 29 వరకు మంత్రుల బస్సు యాత్ర జరుగనుంది. ఈ నేపథ్యంలో గురువారం బస్సు యాత్రపై రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. ‘‘సామాజిక న్యాయం అనే బస్సు యాత్రను వైఎస్సార్ కాంగ్రెస్ చేపట్టబోతున్నది. శ్రీకాకుళం నుంచి బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. నాలుగు రోజుల పాటు ఈ యాత్ర సాగుతుంది.

దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం ఇస్తున్న ప్రభుత్వం మాది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విద్య, సామాజిక అభివృద్దికి మూడేళ్లుగా కంకణం కట్టుకున్నారు. బండ చాకిరి సమాజం కోసం చేస్తూ పాలన అందనంత దూరం ఉన్న వర్గాలు ఇవి. అలాంటి వారికి అధికార బదిలీ సీఎం జగన్‌ పాలనలో జరిగింది. ఈ విషయాలు రాష్ట్రమంతా చెప్పాలనే బస్సు యాత్ర చేస్తున్నాం. 

ఇలాంటి వర్గాలను గౌరవించకుండా మోసగించిన వాళ్లు ప్రజల మధ్యకు వెళ్లి మేము ఏమీ చేయలేదని చెప్తున్నారు. అందుకే మేమే ప్రజల్లోకి వెళ్లి ఏమీ చేశామో సామాజిక విప్లవం ఎలా జరిగిందో చెప్తాం. బస్సు యాత్ర శ్రీకాకుళంలో ప్రారంభమై అనంతపురంలో ముగుస్తుంది. రోజుకో పెద్ద బహిరంగ సభ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మంత్రులు, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు అందరూ పాల్గొంటారు. 

కేబినెట్‌లో 77 శాతం సభ్యులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు. ఇలాంటి దాన్ని అభాసుపాలు చేయడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తోంది. రాజ్యసభ సీటును ఒక తెలంగాణ బీసీ వ్యక్తికి ఇస్తే తప్పు పడుతున్నారు. ఎక్కడున్నాడు అనేది కాదు.. ఆయా వర్గాల ఘోష వినిపించే వ్యక్తి కావాలి. చంద్రబాబు ఎక్కడు ఉంటున్నారు..? తెలంగాణలో కాదా..?. DBT నిధులు 80 శాతం అణగారిన వర్గాలకే వెళ్తోంది. ఏ రోజైనా టీడీపీ బీసీలకు ఒక్క రాజ్యసభ సభ్యత్వమైనా ఇచ్చిందా.? ధరల పెరుగుదల అంటున్నారు.. ఒక్క ఏపీలోనే పెరిగాయా...? దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ధరలు పెరిగాయి. ఐదేళ్లు మీరు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్ నడిపారు. మాలాంటి వారు ప్రజలకు ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాపై ఉంది’’ అని అన్నారు. 

అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కోరిన సమ సమాజాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ చేసి చూపించారు. సీఎం జగన్‌ చేతల్లో చూపించిన విప‍్లవాన్ని ప్రజలకు వివరిస్తాం. 26న విజయనగరం, 27న రాజమండ్రి, 28న నరసరావుపేట, 29న అనంతపురంలో బహిరంగ సభలు జరుగుతాయని తెలిపారు.  

ఇది కూడా చదవండి: ఏపీలో వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు ప్రారంభం

మరిన్ని వార్తలు