నేటి నుంచి డీఎడ్‌ సెమిస్టర్‌ పరీక్షలు 

5 Jul, 2021 08:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

యడ్లపాడు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (2019–21) విద్యార్థులకు మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 5, 6, 7, 8వ తేదీలలో జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్‌ జి.మాణిక్యాంబ తెలిపారు.  రోజూ ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు విద్యార్థులు గంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.

ఆన్‌లైన్‌ ద్వారా హాల్‌ టికెట్లు డౌన్లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో వసతులు కల్పించింనట్టు వెల్లడించారు. విద్యార్థులు మాస్కు ధరించాలని, శానిటైజర్లను వెంట తెచ్చుకోవడంతోపాటు భౌతిక దూరం పాటించాలని కోరారు. 

601 మంది పరీక్షలకు హాజరు 
నాలుగు పరీక్షా కేంద్రాల్లో మొత్తం 601 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. గుంటూరు పరీక్ష కేంద్రంలో 188 మంది, బాపట్లలో 115 మంది, నరసరావుపేటలో 172 మంది, యడ్లపాడు మండలం బోయపాలెంలోని జిల్లా ప్రభుత్వ డైట్‌ కళాశాలలో 126 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని 
అధికారులు వివరించారు.   

బోయపాలెంలో 144 సెక్షన్‌  
బోయపాలెం ప్రభుత్వ డైట్‌ కళాశాలలో సోమవారం నుంచి ఫస్టియర్‌ రెండోసెమిస్టర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నందున పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు తహసీల్దార్‌ జె.శ్రీనివాసరావు తెలిపారు. డైట్‌ కళాశాల సమీపంలో, బోయపాలెం గ్రామంలో ఇంటర్నెట్‌ సెంటర్లు, జిరాక్స్‌ షాపులను పరీక్ష జరిగే సమయంలో మూసివేయాలని ఆదేశించారు. ఈనెల 8 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని చెప్పారు.    

మరిన్ని వార్తలు