ఆఫర్‌లో రూ.7,500 ఫోన్‌ 1,700 లకే!.. ప్రముఖ మొబైల్‌ కంపెనీ పేరు చెప్పడంతో..

14 Apr, 2022 12:27 IST|Sakshi

బి.కొత్తకోట : ఓ ప్రముఖ కంపెనీ 500 మందికి ఆఫర్‌లో మొబైల్‌ ఫోన్‌ను ఇస్తోందని నమ్మించి పార్శిల్‌లో సోంపాపిడి పంపిన ఉదంతం బుధవారం జరిగింది. డబ్బు చెల్లించి పార్శిల్‌ విప్పిచూసిన రైతు మోసపోయి లబోదిబోమంటున్నాడు. బాధిత రైతు కథనం మేరకు వివరాలు..బి.కొత్తకోట మండలం గుట్టపాళ్యంకు చెందిన రైతు రమణారెడ్డికి ఎనిమిదిరోజుల క్రితం బెంగళూరు నుంచి ఫోన్‌ వచ్చింది.

ప్రముఖ మొబైల్‌ కంపెనీ నుంచి 500 మందికి ఆఫర్‌లో మొబైల్‌ ఫోన్లు ఇస్తున్నామని, అందులో మీ పేరుందని చెప్పగా రమణారెడ్డి తిరస్కరించారు. ప్రముఖ మొబైల్‌ కంపెనీ పేరు చెప్పడంతో ధర ఎంతని అడగ్గా అసలు ధర రూ.7,500 అని ఆఫర్‌లో రూ.1,700కు ఇస్తున్నట్టు చెప్పి పార్శిల్‌ పంపారు. కర్ణాటకలోని బెంగళూరు నగరం అలసంద్ర నుంచి బుధవారం గట్టు తపాలా కార్యాలయానికి పార్శిల్‌ వచ్చింది. ఈ పార్శిల్‌ తీసుకోవడానికి రమణారెడ్డి వెళ్లగా పోస్ట్‌మాస్టర్‌ గణేష్‌కు అనుమానం కలిగి పార్శిల్‌ను వెనక్కు పంపుదామని చెప్పాడు.

అయితే మొబైల్‌ వచ్చిందని నమ్మి రమణారెడ్డి పోస్ట్‌మాస్టర్‌కు రూ.1,700 చెల్లించి అక్కడే అందరి సమక్షంలో పార్శిల్‌ తెరవగా అందులో సోంపాపిడి ప్యాకెట్‌ ఒకటి మాత్రమే ఉండటంతో మోసపోయినట్టు గుర్తించిన రమణారెడ్డి సంబంధిత ఫోన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసి విషయం చెప్పినా... మాట్లాడిన మహిళ ఇవేమి వినిపించుకోకుండా పార్శిల్‌ తీసుకొండంటూ చెప్పింది. ఇలాంటి మోసాలు నిత్యం జరుగుతున్నా అమాయక ప్రజలు మోసపోతున్నారు.
(చదవండి:  భర్తతో విడాకులు.. 40 ఏళ్ల వ్యక్తితో స్నేహం.. అసలు విషయం తెలిసి..)

మరిన్ని వార్తలు