సంక్షేమ పాలనకే ‘కొటియా’ ఓటు

12 Apr, 2021 04:15 IST|Sakshi
‘సాక్షి’ కథనం క్లిప్పింగ్‌

కదిలించిన ‘సాక్షి’ 

‘కొటియా’పై వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్వీట్‌ 

ఒడిశాపైనా పెరుగుతున్న ఒత్తిడి 

దూకుడు పెంచిన ఆంధ్రా అధికారులు 

సరిహద్దు ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ 

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రూప్‌ గ్రామాల ప్రజల మనోగతంపై ‘ఒడిశా వద్దు మొర్రో’ శీర్షికన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనం ఇరు రాష్ట్రాల్లోని పాలకులను కదిలించింది. సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. కొటియా ప్రజలకు ప్రయోజనాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవడానికి దోహదపడింది. కొటియా వివాదంపై ట్విట్టర్‌లో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఆదివారం స్పందించారు. ‘కొటియా గ్రామాలన్నీ ఆంధ్రాలోనే ఉంటాం. ఒడిశా వద్దు మొర్రో అంటున్నాయి. సీఎం జగన్‌ సంక్షేమ, అభివృద్ధి పాలనకు ఇదే సాక్ష్యం. వైఎస్సార్‌ తర్వాత ఆ గిరిజన గ్రామాలను పట్టించుకున్న నాయకుడు సీఎం జగనే. నాడు–నేడు, ఇంగ్లిష్‌ మీడియం వల్ల ఆంధ్ర స్కూల్స్‌లోనే వారి పిల్లల్ని చేర్పిస్తున్నారు’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

నిత్యావసర సరుకుల పంపిణీ 
కొటియా గ్రామాల్లో ప్రతి గిరిజన కుటుంబానికి నిత్యావసర సరుకులు అందేలా ఐడీటీఏ పీఓ కూర్మనాథ్‌ చర్యలు చేపట్టారు. పట్టుచెన్నూరులో స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి పట్టుచెన్నూరు, సల్ఫగుడ, ఎగువ మెండంగి గ్రామాలకు, పగులు చెన్నూరులో స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి పగులు చెన్నూరు, డోలియాంబ, ముడకారు గ్రామాలకు, నేరెళ్లవలసలో స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేసి పనుకువలస, దొరలతాడి వలస, రణశింగి, ఫణికి, సింహాగెడ్డ, గాలిగబడారు, మూలతాడివలస గ్రామాలకు, దూలిభద్రలోని స్టాక్‌ పాయింట్‌ నుంచి ఎగువ శంభి, కొటియ, దూలిభద్ర, ఎగువ గంజాయి భద్ర, దిగువ గంజాయి భద్ర గ్రామాలకు నిత్యావసర సరుకులు అందజేయాలని అధికారులకు సూచించారు. ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఒడిశా ప్రభుత్వం, అక్కడి పోలీసులు కొటియా ప్రజలను అడ్డుకోవడాన్ని ఆంధ్రా పోలీస్‌ శాఖ తీవ్రంగా పరిగణించింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో కొటియా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వీఎంసీఎం ఎర్రంన్నాయుడు వివాదాస్పద గ్రామాల్లో పర్యటించారు. 

మరిన్ని వార్తలు