పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ వెల్లడి
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నట్టు పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్భార్గవ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా కోటి జాతీయ జెండాలను పింఛన్దారులకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. శనివారం ఉదయం విజయవాడ బెంజ్ సర్కిల్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వరకు మూడు కిలో మీటర్ల జాతీయ పతాక ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 278 మంది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించడంతో పాటు 399 చెరువులను ఆధునికీకరించి అమృత్ సరోవర్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. త్యాగధనుల స్ఫూర్తిని చాటేలా చారిత్రక సంపద, వారసత్వ కట్టడాలను సుందరంగా తీర్చిదిద్దామన్నారు. అన్ని వర్గాలను జెండా పండుగలో మమేకం చేయడానికి మూడు లఘు చిత్రాలను రూపొందించి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించినట్టు వివరించారు.