61.45 లక్షల మందికి నేడు పింఛన్లు పంపిణీ

1 May, 2021 03:25 IST|Sakshi

ఇప్పటికే రూ. 1,483 కోట్లు సచివాలయ కార్యదర్శుల ఖాతాల్లో జమ

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా 61.45 లక్షల వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులకు నేడు పింఛన్ల పంపిణీ జరగనుంది. ఈ నెలలో కొత్తగా పింఛన్లు మంజూరు అయిన 59,062 మందికి కలిపి పంపిణీ కొనసాగనుంది. వీరందరికీ పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 1,483.68 కోట్లను శుక్రవారం సాయంత్రానికే ఆయా గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. శనివారం తెల్లవారుజాము నుంచి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి వలంటీర్లు పింఛను డబ్బులు పంపిణీ చేస్తారు. పింఛనుదారుడి బయోమెట్రిక్, ఐరిస్‌ గుర్తింపు.. లేదంటే రియల్‌టైం బెనిఫీషియరీ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ (ఆర్‌బీఐఎస్‌) విధానాలలో పంపిణీ చేస్తారు.

ఈ మూడు ప్రక్రియల ద్వారా ఏ లబ్ధిదారుడికైనా పంపిణీలో ఇబ్బంది కలిగితే ఆ లబ్ధిదారుని కుటుంబ సభ్యుల బయోమెట్రిక్‌ ద్వారా వలంటీర్లు పంపిణీ చేస్తారు. వలంటీర్ల ద్వారా జరిగే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతి సచివాలయ పరిధిలో డిజిటల్‌ అసిస్టెంట్‌ స్వయంగా పర్యవేక్షిస్తారని.. జిల్లా స్థాయిలో పర్యవేక్షణకు ఆయా జిల్లాల డీఆర్‌డీఏ ఆఫీసులో పర్యవేక్షణ కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని సెర్ప్‌ సీఈవో రాజాబాబు తెలిపారు.   


(చదవండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవిడ్‌ చికిత్సలకు ఫీజుల నిర్ధారణ)

>
మరిన్ని వార్తలు