రెండో రోజు కొనసాగిన పింఛన్ల పంపిణీ

3 Nov, 2020 04:26 IST|Sakshi
ఆస్పత్రిలో ఉన్న బాధితుడికి అర్ధరాత్రివేళ పింఛన్‌ అందజేస్తున్న వెల్ఫేర్‌ అసిస్టెంట్‌

సాక్షి, అమరావతి/బలిజిపేట (పార్వతీపురం): రెండో రోజు సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. తొలిరోజు పంపిణీకి వీలు కాని వారికి వలంటీర్లు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. సోమవారం నాటికి మొత్తం 58,99,388 మందికి పంపిణీ పూర్తి కాగా, రూ.1,420.92 కోట్లు లబ్ధిదారులకు అందజేశారు. మొత్తం పింఛనుదారుల్లో 95.24 శాతం మందికి పింఛన్లు అందాయి. 

అర్ధరాత్రి వేళ ఆస్పత్రి వద్దకే పింఛన్‌ 
లబ్ధిదారుడి అవసరం తీర్చడానికి అర్ధరాత్రి వేళ ఆస్పత్రి వద్దకే పింఛన్‌ తరలివెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకికి చెందిన పింఛన్‌ లబ్ధిదారుడు జి.తిరుపతి డయాలసిస్‌ నిమిత్తం విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. ఇతనికి బయోమెట్రిక్, ఐరిస్‌ పడకపోవడంతో అప్పటికి ఇంకా పింఛన్‌ అందలేదు. ఇటువంటి వారికి సచివాలయంలోని వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ అథంటికేషన్‌తో వెంటనే పింఛన్‌ అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం సాయంత్రం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సమాచారంతో వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ అశోక్‌ ఆదివారం అర్ధరాత్రి వేళ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లి తిరుపతికి రూ.10 వేలు పింఛన్‌ అందించారు. అంత రాత్రివేళ సుదూరం నుంచి వచ్చిన వెల్ఫేర్‌ అసిస్టెంట్‌కు ఆ లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపాడు.  

మరిన్ని వార్తలు