తెలతెలవారుతుండగానే పింఛన్ల పంపిణీ
తలుపు తట్టిన వలంటీర్లు
లబ్ధిదారుల సంతోషం
చినుకులను లెక్కచేయకుండా సాగిన ప్రక్రియ
జిల్లాలో 3,48,781 మందికి పింఛన్లు
రూ 84.31 కోటక్లు పైగా నగదు పంపిణీ
కడప రూరల్: జిల్లా వ్యాప్తంగా వాన పడుతూనే ఉంది. అయినా పింఛన్ల పింపిణీ ప్రక్రియ ఆగలేదు. వలంటీర్లు చినుకులను ఏమాత్రం లెక్క చేయకుండా ఉదయాన్నే లబ్ధి దారులు ఇంటికి వెళ్లారు. తలుపు తట్టి పింఛన్ నగదును అందజేశారు. ప్రతి నెలా ఠంఛన్గా గడపవద్దకే పింఛన్ రావడంతో అవ్వాతాతలు సంతోషపడ్డారు. వైఎస్సార్ పింఛన్ కానుక కింద సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియ గురువారం సాగింది. జిల్లా అంతటా రాత్రి నుంచి వర్షం పడుతూనే ఉంది. అయినా ఆయా ప్రాంతాల్లోని వలంటీర్లు మసక చీకటిలోనే ముందుకు కదిలారు. వేలి ముద్రలు తీసుకొని పింఛన్ నగదును అందజేశారు. జిల్లాలో 15 కేటగిరీల కింద 3,48,781 లక్షల మందికి పింఛనుదారులున్నారు. వారికి రూ. 84,31,86,000 పంపిణీ చేయాలి. సాంకేతిక సమస్యలు తలెత్తినా పంపిణీ ప్రక్రియ సజావుగా సాగింది.
ముఖ్యమంత్రి జగన్ చలవ...
నడవలేని స్థితిలో మంచానికే పరిమితమైన ఈ వృద్ధుడి పేరు. మునగా పురుషోత్తం శెట్టి. కడప నగరం రవీంద్రనగర్ పాత లా కాలేజి ప్రాంతంలో ఉంటున్నారు. ఉదయాన్నే ఆ ప్రాంత వాలంటీరు రూతు వచ్చింది. ‘తాతా..బాగున్నావా’ అని ఆప్యాయంగా పలకరించింది. వేలి ముద్ర తీసుకొని వృద్యాప్త పింఛన్ సొమ్మును ఆయన చేటిలో పెట్టింది. దీంతో పురుషోత్తం శెట్టి సంతోషపడ్డారు. నేను నడవలేని స్థితిలో ఉన్నాను. పింఛన్ సొమ్ము నా మంచం వద్దకే వచ్చింది అని అన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి జగన్ చలవ అని ఆనందంగా చెప్పారు.