96.35 శాతం మందికి అందిన పింఛన్లు

3 May, 2022 03:26 IST|Sakshi
ఏలూరు లక్ష్మివారపుపేటలో బి.రంగమ్మకు సోమవారం వృద్ధాప్య పింఛన్‌ అందజేస్తున్న వలంటీర్‌ కె.గాయత్రి

రెండోరోజూ కొనసాగిన పంపిణీ  

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా రెండోరోజు సోమవారం కూడా పింఛన్ల పంపిణీ కొనసాగింది. రెండురోజుల్లో ప్రభుత్వం 96.35% మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని పూర్తిచేసింది. 58,65,578 మందికి వలంటీర్లు రూ.1,490.58 కోట్లు పంపిణీ చేశారు. ఈ నెలకు మొత్తం 60,87,942 మందికి పింఛన్లు పంపిణీ చేసేందుకు రూ.1,547.17 కోట్లు విడుదలకాగా.. ఆదివారమే 53.26 లక్షల మందికి పంపిణీ పూర్తిచేసిన విషయం తెలిసిందే. మరో మూడురోజులు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి డబ్బులు పంపిణీచేసే కార్యక్రమం కొనసాగుతుందని సెర్ప్‌ అధికారులు తెలిపారు.

రాయచూర్‌ వెళ్లి పింఛను పంపిణీ
ముండ్లమూరు: ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని బృందావనం తండాకు చెందిన వలంటీర్‌ రామావత్‌ రమేష్‌నాయక్‌ తన క్లస్టర్‌ పరిధిలోని ఇద్దరు పెన్షన్‌దారులకు సోమవారం కర్ణాటక రాష్ట్రం రాయచూర్‌ వెళ్లి పెన్షన్‌ అందించారు. బృందావనం తండాకు చెందిన బాణావత్‌ ప్రసాద్‌నాయక్, పాత్లావత్‌ ఠాగూర్‌నాయక్‌ పట్టాలు అద్దెకు ఇచ్చి జీవనం సాగించేందుకు కర్ణాటకలోని రాయచూర్‌ జిల్లాకు వెళ్లారు. దీంతో 2నెలల నుంచి వారికి వస్తున్న వృద్ధాప్య పింఛన్‌ తీసుకోలేకపోయారు. వృద్ధాప్యం కారణంగా వారు రాలేకపోయారన్న విషయం తెలుసుకున్న వలంటీర్‌ రమేష్‌నాయక్‌ రాయచూర్‌ వెళ్లి పింఛన్‌ అందజేశారు.

మరిన్ని వార్తలు