అమ్మాయిలు ధైర్యంగా ఉండండి : సుచరిత

17 Oct, 2020 18:01 IST|Sakshi

దివ్య కుటుంబాన్ని పరామర్శించిన సుచరిత

హోంమంత్రికి లేఖ రాసిన దివ్య తల్లిదండ్రులు

సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన విజయవాడకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని తల్లిదండ్రులు హోంమంత్రి మేకతోటి సుచరితకు లేఖ రాశారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకో ఆడబిడ్డకు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్‌ చేశారు.  దివ్యను దారుణంగా చంపిన ఉన్మాదికి విధించే శిక్ష రాష్ట్ర చరిత్రలో నిలిచిపోవాలి కోరారు. ఆడపిల్లలపై దాడులు చేయాలంటేనే భయపడేలా శిక్ష ఉండాలని లేఖలో పేర్కొన్నారు. మా పాపకు తక్షణ న్యాయం జరిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. క్రీస్తురాజపురంలో చాలామంది గుట్కా, గంజాయి, మద్యానికి బానిసలై ఉన్మాదులుగా మారుతున్నారని, వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి శనివారం రాసిన లేఖలో కోరారు. (దివ్య కేసులో ఊహించని ట్విస్ట్‌లు: ఆడియోలు లీక్‌)

దివ్య కుటుంబాన్ని పరామర్శించిన సుచరిత
దివ్య తల్లిదండ్రులకు శనివారం సాయంత్ర సుచరిత పరామర్శించారు. దివ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భగా తమకు న్యాయం చేయాలని కోరుతూ లేఖను హోంమంత్రికి అందించారు. బాధితు కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని సుచరిత భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. ‘దివ్య ఘటన బాధాకరం. ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దివ్య కుటుంబానికి అండగా ఉంటాం. తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. నిందితుడిపై ఎస్సీఎస్టీ, 302 కేసు నమోదు చేశాం. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. అమ్మాయిలు ధైర్యంగా ఉండాలి. ఎలాంటి సమస్య వచ్చినా తల్లిదండ్రులకు చెప్పాలి. 100కు ఫోన్‌ చేస్తే పోలీసులు వెంటనే స్పందిస్తారు. ప్రతి ఒక్కరూ దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి:’ అని పేర్కొన్నారు.

కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని (22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మరిన్ని వార్తలు