డాక్టర్‌ మురళీకృష్ణ అరెస్టు

7 Sep, 2020 10:06 IST|Sakshi

18 వరకు రిమాండ్, జైలుకు తరలింపు

ఏలూరు టౌన్(పశ్చిమ గోదావరి జిల్లా‌): ఏలూరు ఎన్‌ఆర్‌పేటలోని మురళీకృష్ణ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ మురళీకృష్ణపై ఏలూరు త్రీటౌన్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌కిరణ్‌ పర్యవేక్షణలో ఏలూరు త్రీటౌన్‌ పోలీసులు డాక్టర్‌ మురళీకృష్ణను ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. అనంతరం మురళీకృష్ణను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్‌ విధించారు. వైద్య పరీక్షల అనంతరం మురళీకృష్ణను భీమవరం సబ్‌జైలుకు తరలించారు. (కార్పొ‘రేటు’ దోపిడీ)

మురళీకృష్ణ హాస్పిటల్‌లో అనుమతులు లేకుండానే కోవిడ్‌కు చికిత్స చేయటం, కొంతమంది మరణానికి కారకులు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పటికే ఆ హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఒక బాధితుడు ఏలూరు త్రీటౌన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏలూరుకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రావటంతో జూలై 23న బాధితుడ్ని మురళీకృష్ణ హాస్పిటల్‌లో చేర్పించారు. అదే నెలలో ఐదురోజుల అనంతరం బాధితుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. వైద్యానికి సుమారుగా రూ.2లక్షల వరకూ వసూలు చేసిన వైద్యుడు, రోగి మృతిచెందిన తరువాత కూడా ఇంజెక్షన్లకు అంటూ మరో రూ.32,500లు వసూలు చేశాడని మృతుడి కుమారుడు చెబుతున్నాడు. అతని ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ సీఐ మూర్తి ఆధ్వర్యంలో ఎస్సై ప్రసాద్‌ కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రికి డాక్టర్‌ మురళీకృష్ణను అరెస్టు చేశారు. (ఏలూరులో ప్రైవేటు ఆసుపత్రి దందా)

మరిన్ని వార్తలు