బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్‌ చేప

3 Feb, 2023 21:12 IST|Sakshi
ఏపీత్రయంలో గట్టుపై ఉంచిన డాల్ఫిన్‌ చేప

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా: మండలంలోని ఏపీత్రయం శివారు బిక్కవోలు డ్రెయిన్‌లో గురువారం మధ్యాహ్నం డాల్ఫిన్‌ చేప స్థానికులకు చిక్కిందని తహసీల్దార్‌ టి.సుభాష్, జిల్లా ఫారెస్ట్‌ అధికారి ఐవీకే రాజు తెలిపారు. బిక్కవోలు డ్రెయిన్‌లో డాల్ఫిన్‌ చేప కనిపించడంతో స్థానికులు తమకు సమాచారం అందించారన్నారు. అక్కడికి వెళ్లి స్థానికుల సహాయంతో ఏపీత్రయం వంతెన సమీపంలో డాల్ఫిన్‌ చేపను ఆ డ్రెయిన్‌లో విడిచిపెట్టామన్నారు.

కొంతసేపటికి అది నీటిలో మునిగిపోయిందన్నారు. జాలర్లు వెదకగా అది చనిపోయినట్లు గుర్తించారు. డాల్ఫిన్‌ 150 కేజీల బరువు, 1.5 మీటర్ల పొడవు ఉందన్నారు. ఇది సముద్రంలో నుంచి ఇంద్రపాలెంలో గల ఉప్పుటేరు మీదుగా బిక్కవోలు డ్రెయిన్‌లోకి వచ్చి ఉంటుందని తెలిపారు. నిబంధనల ప్రకారం డాల్ఫిన్‌కు  శుక్రవారం పోస్టుమార్టం చేస్తారన్నారు. గ్రామంలోని ఏటిగట్టు వద్ద ఉన్న డాల్ఫిన్‌ను చూడటానికి జనం ఎగబడ్డారు. వీఆర్వో జి.అంచిబాబు, ఫారెస్ట్‌ అధికారులు సిద్ధార్థ, ఉపేంద్రరెడ్డి, వసంతకుమారి పాల్గొన్నారు.
చదవండి: రెండురోజుల్లో పెళ్లి.. అంతలోనే యువకుడి షాకింగ్‌ నిర్ణయం.. ఏం జరిగింది?   

మరిన్ని వార్తలు