301 సంస్కరణలను అమలు చేయండి

13 Sep, 2020 05:19 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రస్తుత సంవత్సరం సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ – ఈవోడీబీ) కోసం 301 సంస్కరణలను అమలు చేయాలని రాష్ట్రాలకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) సూచించింది. 2020–21 ర్యాంకుల కోసం 15 విభాగాల్లో ఈ సంస్కరణలను నవంబర్‌లోగా అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. 

► 2019 సంవత్సరానికి గాను 187 సంస్కరణలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానం పొందిన సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు విడుదల కావడంతో వీటి అమలుకు రాష్ట్ర పరిశ్రమల శాఖ శ్రీకారం చుట్టింది.
► వీటి ప్రకారం కొన్ని చట్టాలను సవరించాల్సి ఉండగా, మరికొన్నింటి కోసం ప్రత్యేక అప్లికేషన్లను అభివృద్ధి చేయాల్సి ఉంది.
► సంస్కరణల అమలుకు రెండున్నర నెలలే సమయం ఉండటంతో అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులతో సమావేశాలు నిర్వహించి కొత్త మార్గదర్శకాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని పరిశ్రమల శాఖ చేపట్టింది.
► ఈ సంస్కరణలను అమలు చేశాక వీటి ప్రయోజనం పొందిన వారి నంబర్లు తీసుకుని సర్వే నిర్వహించడం ద్వారా ర్యాంకులను నిర్థారిస్తారు. అయితే సర్వేకి సంబంధించిన మార్గదర్శకాలు ఇంకా విడుదల కాలేదు.
► ఈ ఏడాది కొత్తగా పర్యాటకం, టెలికాం, ఆతిథ్యం, ట్రేడ్‌ లైసెన్స్, హెల్త్‌ కేర్, తూనికలు–కొలతలు, సినిమా హాళ్లు, సినిమా షూటింగ్‌లకు సంబంధించిన సంస్కరణలను ప్రవేశపెట్టినట్టు రాష్ట్ర పరిశ్రమల శాఖ పేర్కొంది. 
► సింగిల్‌ విండో విధానంలో ఆన్‌లైన్‌ దరఖాస్తు నమోదు దగ్గర్నుంచి రుసుంల చెల్లింపులు, ధ్రువీకరణ పత్రాల స్వీకరణ, థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ వంటి సౌకర్యాలను అందుబాటులోకి తేవాల్సి ఉంటుంది. 

మరిన్ని వార్తలు