-
సాక్షి, అమరావతి: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేస్తున్న ద్రౌపది ముర్ము వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతు కోరేందుకు మంగళవారం విజయవాడకు వస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో మంగళగిరి సమీపంలోని కన్వెన్షన్ హాల్లో జరిగే వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె పాల్గొంటారు. ఎన్నికల్లో మద్దతివ్వాలని కోరనున్నారు. నామినేటెడ్ నుంచి కేబినెట్ పదవుల వరకూ దేశచరిత్రలో ఎన్నడూలేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సింహభాగం పదవులిచ్చిన సీఎం వైఎస్ జగన్.. సామాజిక న్యాయం చేయడమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు.
తద్వారా ఆ వర్గాల సామాజిక, రాజకీయ, విద్య, ఆర్థిక సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ముకు అవకాశం వచ్చింది. ఈ నేపథ్యంలో.. సామాజిక న్యాయానికి కట్టుబడిన పార్టీగా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న పార్టీగా ద్రౌపది ముర్ముకు ఇప్పటికే వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. దీంతో.. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఆమె పాల్గొని.. రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరనున్నారు.