ప్యాసింజర్‌ రైళ్లను ఇప్పట్లో నడపలేం

18 Aug, 2020 07:18 IST|Sakshi

డివిజన్‌లో వేగంగా అభివృద్ధి పనులు  

డీఆర్‌ఎం అలోక్‌తివారీ 

గుంతకల్లు: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నవంబర్‌ నాటికి కూడా ప్యాసింజర్‌ రైళ్లను నడపడం కష్టమేనని డీఆర్‌ఎం అలోక్‌తివారీ తెలిపారు. సోమవారం ఆయన గూగుల్‌ మీట్‌ యాప్‌ ద్వారా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన డివిజన్‌లో జరుగుతున్న పలు రైల్వే అభివృద్ధి పనులను తెలిపారు. ఎర్రగుంట్ల – నంద్యాల మధ్య 123 కి.మీ, ధర్మవరం – పాకాల మధ్య 227 కి.మీ విద్యుద్దీకరణ పనులను 2021లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలోనే గుత్తి – ధర్మవరం మధ్య 30 కి.మీ డబులింగ్‌ రైలు మార్గం చేయనున్నట్లు తెలిపారు. గుత్తి యార్డులో దాదాపు రూ.15 కోట్లతో ఆధునిత ఎలాక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నిల్‌ వ్యవస్థను పూర్తిచేసి అందుబాటులోకి తెచ్చామన్నారు.

మిషన్‌ రఫ్తార్‌లో భాగంగా గుత్తి – రేణుగుంట మధ్యలో 130 కిమీ వేగంతో సుమారు 280 కి.మీలు (రానుపోను) రైలు నడిపినట్లు తెలిపారు. ఈ స్పీడ్‌ ట్రయల్‌ రన్‌ను సీఓసీఆర్‌ (కన్ఫర్మేటరీ ఓసీలోగ్రాప్‌ కార్‌ రన్‌) ద్వారా  ఈ రైలు మార్గంలో ట్రాక్‌ పటిష్టతతో పాటు 23 వంతెనల నాణ్యతను, సిగ్నిల్‌ వ్యవస్థను పరిశీలించామన్నారు. అలాగే గుత్తి – వాడీ మధ్య ట్రాక్‌ పటిష్ట పరిచే పనులు వేగవంతంగా చేస్తున్నామని, ఈ డిసెంబర్‌ నాటికి ఈ మార్గంలో కూడా 130 కి.మీ వేగంతో రైళ్లను నడుపుతామన్నారు. జిల్లా కలెక్టర్‌ అనుమతితో గుంతకల్లు రైల్వే డివిజనల్‌ ఆస్పత్రిని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌గా ఏర్పాటు చేసి రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు