Dry Fruits: కరోనా కాలం.. బండ్లపై రోజూ 15 లక్షల వ్యాపారం!

31 May, 2021 05:25 IST|Sakshi
డ్రై ఫ్రూట్స్‌ విక్రయాలు

ఇమ్యూనిటీ పెంచుకోవడానికి జనం ఆసక్తి

జోరుగా డ్రై ఫ్రూట్స్‌ కొనుగోళ్లు

జిల్లా అంతటా తోపుడు బండ్లపై రోజూ రూ. 15 లక్షల వ్యాపారం

కడప కల్చరల్‌: శత్రువుతో పోరాడాలంటే మనకు అతనికి మించిన శక్తి కావాలి. ఆయుధాలు లేకపోయినా ఎదుటివాడి దాడిని అడ్డుకునే ఆత్మవిశ్వాసం కావాలి. ప్రస్తుతం కోవిడ్‌ వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో జనం రోగ నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని పెంచుకోవాలని, అందుకు పోషకాహారం తీసుకోవాలని భావిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పెంచుకోవడం డ్రై ఫ్రూట్స్‌ తీసుకోవడంతోనే సాధ్యమంటున్నారు. కరోనా కట్టడిలో భాగంగా రోగ నిరోధకశక్తి పెంచుకోవాలని వైద్యులు సైతం సూచించడంతో జనం వాటిపై మొగ్గు చూపుతున్నారు. 

ఉపాధి దెబ్బతిన్నా.. 
కరోనాతో 95 శాతం పనులు నిలిచిపోయాయి. వ్యాపారాలు కూడా కుదేలయ్యాయి. ఈ నేపత్యంలో డ్రై ఫ్రూట్స్‌ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకున్నా ప్రాణం కంటే ఎక్కువ కాదు గనుక దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా వాడుతున్నారు. దీంతో డ్రై ఫ్రూట్స్‌ వ్యాపారాలు మాత్రం ఇంతకు ముందెన్నడూ కనివినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కేవలం కడప నగరంలోనే 30కి పైగా డ్రై ఫ్రూట్స్‌ విక్రయించే తోపుడు బండ్లు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 150కి పైగా ఉన్నాయి. పట్టణాలు, మండలాల్లో కూడా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇందులో ప్రధానంగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష, ఎండు, పండు ఖర్జూరాలు, వాల్‌నట్స్, దోస, పుచ్చ గింజలు తదితరాలు విక్రయిస్తున్నారు. ఇవి తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని, కరోనా వచ్చినా ధీటుగా ఎదుర్కొవచ్చని ప్రజల్లో నమ్మకం బాగా పెరిగింది. అందుకే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

కోట్లలో వ్యాపారం
కరోనా రానంత వరకు జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం తదితరాలను తక్కువగా వాడేవారు. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి డ్రై ఫ్రూట్స్‌ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని వైద్యులు చెప్పడంతో వాటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వినియోగం పెరగడంతో ధరలు కూడా 20–30 శాతం పెరిగాయి. కరోనా రాకముందు రోజూ కేవలం 2–4 వేల రూపాయల వ్యాపారం మాత్రమే జరిగేది. ఇప్పుడు రోజూ కనిష్ఠంగా రూ. 10 వేల వ్యాపారం జరుగుతోందని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా అంతటా తోపుడు బండ్లపైనే రోజూ రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతోందని కిరాణా, మసాల దినుసులు, ఇతర దుకాణాల ద్వారా మరో రూ. 15 లక్షల వ్యాపారం జరుగుతోందని వ్యాపారుల అంచనా. జిల్లా వ్యాప్తంగా తోపుడుబండ్లు, దుకాణాల్లో నెలకు రూ. 9–10 కోట్ల వ్యాపారం జరుగుతున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు