నేడు తెరుచుకోనున్న ద్వారక ద్వారాలు

1 Aug, 2020 09:42 IST|Sakshi
ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన రాజగోపుర ద్వారాలు

పశ్చిమగోదావరి,ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ ద్వారాలు శనివారం తెరచుకోనున్నాయి. కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ఆదేశాల మేరకు ఈనెల 25 నుంచి 31 వరకు ద్వారకాతిరుమలలో లాక్‌డౌన్‌ విధించారు. దీంతో దేవస్థానం అధికారులు ఆరోజు నుంచి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. లాక్‌డౌన్‌ ముగియడంతో కలెక్టర్‌ ఉత్తర్వుల మేరకు శనివారం ఉదయం 6 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నట్టు దేవస్థానం ఈఓ రావిపాటి ప్రభాకరరావు తెలిపారు.

కేశఖండన శాలలో యాత్రికులు మొక్కుబడులు తీర్చుకోవచ్చని చెప్పారు. క్షేత్రానికి వచ్చే భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి ఆలయంలోకి అనుమతిస్తామన్నారు. భక్తులు భౌతిక దూరాన్ని పాటించాలని, మాస్కులు ధరించాలని, విధిగా శానిటైజర్‌తో చేతులు శుభ్రపరచుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఆదివారం జిల్లా అంతటా లాక్‌డౌన్‌ విధించిన కారణంగా ఆరోజు భక్తులకు ఆలయ ప్రవేశాన్ని నిలుపుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కేశఖండనశాలను కూడా మూíసివేస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఈఓ కోరారు. 

మరిన్ని వార్తలు