ఏపీ: ఇకపై ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్‌

8 Jun, 2021 21:58 IST|Sakshi

మరింత పారదర్శకత కోసం చర్యలు

ఇందుకోసం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసిన మైనింగ్ శాఖ

సాక్షి, అమరావతి: ఇకపై ఏపీలో ఇసుక తవ్వకాలకు ఈ-పర్మిట్ తప్పనిసరి చేశామని.. ఇందుకోసం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేసినట్లు భూగర్భ గనుల శాఖ సంచాలకులు (డీఎంజీ) వీజీ వెంకటరెడ్డి తెలిపారు. ఇసుకకు ఈ-పర్మిట్‌ కోసం మైనింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను సిద్దం చేశామని, ఇప్పుడు అమలులోకి తీసుకువస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు ఇతర మినరల్స్‌కు అనుమతులు ఇచ్చేందుకు ఈ-పర్మిట్ విధానాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై ఇసుక తవ్వకాలకు కూడా ఇదే విధానం వర్తింపచేస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకు అనుమతి ఉన్న జేపీ పవర్ వెంచర్స్‌ సంస్థ ఇకపై రీచ్‌ల వారీగా ఇసుక తవ్వకాలు జరిపేందుకు ఆన్‌లైన్‌లో ఈ-పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఆయా రీచ్‌ల పరిధిలోని మైనింగ్ అసిస్టెంట్ డైరెక్టర్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎటువంటి జాప్యం లేకుండా డీఎంజీ కార్యాలయం నుంచి ఈ-పర్మిట్‌ను జారీ చేస్తామన్నారు. ఈ పర్మిట్ వల్ల ఏ రీచ్‌లో ఎంత ఇసుక తవ్వకానికి సంబంధించి అనుమతులు ఇచ్చాం. ఏ మేరకు మైనింగ్ జరిగిదనేది ఖచ్చితంగా తెలుస్తుందని, ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన వివరాలు నమోదవ్వడం వల్ల మరింత పారదర్శకత, జవాబుదారీతనం వస్తుందన్నారు.

చదవండి: వ్యాక్సినేషన్: ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
ఈ ఏడాదిని చీని, నిమ్మ సంవత్సరంగా ప్రకటిస్తున్నాం: కన్నబాబు

మరిన్ని వార్తలు