4,02,336 మందికి ఈబీసీ నేస్తం

21 Apr, 2021 05:02 IST|Sakshi

ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడేళ్లకు రూ.45 వేలు

మొత్తం రూ.1,810.51 కోట్ల బడ్జెట్‌ 

పథకం అమలుకు మార్గదర్శకాలు విడుదల

సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు చేయూత అందించే ఈబీసీ నేస్తం పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, వారిని ఏవిధంగా గుర్తించాలనే దానిపై మంగళవారం బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులిచ్చారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న అగ్రవర్ణాల మహిళలకు ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు సంవత్సరాలపాటు రూ.45 వేలు ఇవ్వనుంది. ఈ పథకం కింద 4,02,336 మంది లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదికి రూ.603.5 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.1,810.51 కోట్లు ఈ పథకం అమలుకు ఖర్చవుతుంది. ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. 

లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు
ఆధార్‌కార్డు, బ్యాంక్‌ ఖాతా ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి. మునిసిపల్‌ ఏరియాలో 750 చదరపు అడుగులలోపు ఇల్లు ఉన్న వాళ్లు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అనర్హులు. ఇందులో పారిశుధ్య ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. కారు ఉండకూడదు (ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో ఉండవచ్చు). కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదు.

ప్రభుత్వం ఈ పథకం గురించి ఆదేశం ఇచ్చిన రోజు నుంచి లబ్ధిదారుల వయసును పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వేచేసి అర్హతలున్న వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత వివిధ దశల్లో పరిశీలించి జిల్లా కలెక్టర్‌ తుది జాబితా రూపొందిస్తారు. ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌  ఠీఠీఠీ. n్చఠ్చిట్చజ్చుఝ. ్చp. జౌఠి. జీnను అభివృద్ధి చేశారు. అర్హుల గుర్తింపు నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ప్రక్రియ అంతా దీనిద్వారానే జరుగుతుంది. ఎంపిక పూర్తయ్యాక నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు.  

మరిన్ని వార్తలు