జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌.. భారీగా ఆస్తుల అటాచ్‌

30 Nov, 2022 12:10 IST|Sakshi

సాక్షి, అనంతపురం: టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ర్డెఇకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాక్‌ ఇచ్చిది. బస్సుల కొనుగోలు కుంభకోణం కేసులో ప్రభాకర్‌ రెడ్డి, ఆయన అనుచరుడు గోపాల్‌రెడ్డి ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. దివాకర్‌ రోడ్‌లైన్స్‌, జఠాదర ఇండస్ట్రీస్‌కు చెందిన 22.10 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. జీఎస్‌ 4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. అశోక్‌ లేలాండ్‌ నుంచి తక్కువ ధరకు వాహనాలు కొన్నట్లు తెలిపింది.

స్క్రాప్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్లతో కొత్త వాహనాలు నడిపినట్టు ఈడీ పేర్కొంది. బీఎస్‌ 4 వాహనాల స్కాంలో రూ. 38.36 కోట్ల కుంభకోణం జరిగినట్లు తెలిపింది. రూ.6.31 కోట్ల విలువైన నగదు, అభరణాలు, బ్యాంక్‌ డిపాజిట్లు సీజ్‌ చేశారు. రూ. 15.79 కోట్ల విలువైన 68 చరాస్తులను సీజ్‌ చేశారు.
చదవండి: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టు షాక్‌

అక్రమాల బాగోతం ఇలా..
టీడీపీ సీనియర్‌ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి బ్రదర్స్‌ సుప్రీంకోర్టు నిషేధించిన బీఎస్‌–3 కేటగిరీకి చెందిన 154 లారీలు, బస్సులను తుక్కు కింద జటాధర ఇండస్ట్రీస్‌ పేరున 50, సి. గోపాల్‌రెడ్డి అండ్‌ కో పేరున 104 వాహనాలను కొన్నారు. నకిలీపత్రాలతో వాటిని బీఎస్‌–4 వాహనాలుగా చలామణిలోకి తీసుకొచ్చారు. అనంతరం వాటిని నాగాలాండ్‌ రాజధాని కోహిమాలో రిజిస్ట్రేషన్‌ చేయించి, ఎన్‌ఓసీ పొందారు. ఆ తర్వాత 15 రోజుల్లోనే వాటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌లలో మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించారు.

ఆంధ్రప్రదేశ్‌లో 101 వాహనాలు, తెలంగాణలో 33 వాహనాలు, కర్ణాటకలో 15 వాహనాలు, తమిళనాడులో ఒకటి, ఛత్తీస్‌గఢ్‌లో ఒక బస్సు నిర్వహిస్తున్నారు. ఆ వాహనాల లైసెన్సులకు కూడా ఫోర్జరీ పత్రాలు సమర్పించారు. అంతేకాక.. వాహనాల బీమాలోనూ వీరు ఫోర్జరీకి పాల్పడ్డారు. వీటిని కొద్దిరోజులపాటు తిప్పి ఆ తర్వాత పోలీసుల ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్లతో (ఎన్‌ఓసీ) వాటిని ఇతర రాష్ట్రాల వారికి విక్రయించేశారు.

కానీ, వీటిని కొనుగోలు చేసినవారు తాము మోసపోయామని గుర్తించి ఫిర్యాదుచేశారు. సమగ్ర సమాచారం కోసం పోలీసులు ‘నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఐసీ)’ రికార్డులను పరిశీలించారు. జేసీ కుటుంబం సమర్పించిన బీమా పత్రాలు నకిలీవని తేలింది. దీంతో అనంతపురం డిప్యూటీ రవాణా శాఖ కమిషనర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2020 జూన్‌లో జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డితోపాటు 23 మందిపై వివిధ సెక్షన్ల కింద 35 కేసులు నమోదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్టుచేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.

మరిన్ని వార్తలు