వెలుగులోకి నారాయణ, శ్రీచైతన్య కాలేజీల ఫీజుల బాగోతం

20 Jan, 2021 14:38 IST|Sakshi

కళాశాలల్లో అధిక ఫీజులపై ఫిర్యాదులు 

విద్యాశాఖ కమిషన్‌ ఆకస్మిక తనిఖీలు

సాక్షి, విజయవాడ: విద్యాశాఖ కమిషన్‌ చేపట్టిన పాఠశాలల తనిఖీల్లో జూనియర్‌ కాలేజీలు నారాయణ, శ్రీ చైతన్యల అధిక ఫీజుల వసూళ్ల బాగోతం బట్టబయలైంది. రాష్ట్రంలోని పలు పాఠశాలపై విద్యాశాఖ కమిషన్‌ నాలుగు బృందాలు బుధవారం తనీఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ప్రొఫెసర్‌ నారాయణరెడ్డి, డాక్టర్‌ ఈశ్వరయ్య కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ పాఠశాలల యాజమాన్యాలపై విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ సంక్రాంతికి 60 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయల వరకు ఫీజులు కట్టించుకున్నారంటూ విద్యార్థులు అధికారులతో ఎదుట వాపోయారు. టాయిలెట్లలో కనీస సౌకర్యాలు లేవని, ప్రతి ఏడుగురికి ఒక బాత్‌రూమ్‌ కేటాయించారని తెలిపారు.

ఇంటర్‌ మొదటి ఏడాదికి లక్షన్నర వరకు వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇక గూడవల్లి శ్రీ చైతన్య కళాశాలలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కనీస వసతులు కూడా లేకుండానే తరగతులు నిర్వహిస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. తాగునీరు, బాత్‌రూమ్‌ కుళాయిలు లేకపోవటంతో కమిషన్‌ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా సరైన భోజనం పెట్టడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక నారాయణ యాజమాన్యం అధిక ఫీజులు వసూలు చేస్తోందని, జీవో 51ని కూడా యాజమాన్యం అమలు చేయడం లేదని వెల్లడించారు. 

నారాయణ యాజమాన్యం ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిందని, విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా కల్పించడం లేదని కమిషన్‌ సభ్యులు సీఏవీ ప్రసాద్‌ పేర్కొన్నారు. అంతేగాక కాలేజీల్లో సామాజిక దూరం అమలు చేయడం లేదని, కనీసం శానిటైజర్లు కూడా అందుబాటు ఉంచలేదన్నారు. విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారని మండిపడ్డారు. సదుపాయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని, మౌలిక వసతులు కూడా సరిగా లేని కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గతేడాది ట్యూషన్‌ ఫీజులో 30 శాతం తగ్గించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కళాశాలలు ఉల్లంఘించాయన్న ఫిర్యాదులపై పాఠశాల విద్యాశాఖ కమిషన్‌ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించింది.

మరిన్ని వార్తలు