దేశంలో విద్య వ్యాపారమైపోయింది

29 Sep, 2020 04:34 IST|Sakshi

ప్రభుత్వ అర్హత పరీక్ష పాసైన వారే డీఈడీ కోర్సు చదవాలి

‘స్పాట్‌ అడ్మిషన్‌’ అంటే దొడ్డిదారిన ప్రవేశం కల్పించడమే

2017లో నాటి ప్రభుత్వం వదిలేసిందని ఇప్పుడూ వదిలేయమంటారా?

డీఈడీ కాలేజీల యాజమాన్యాలపై హైకోర్టు మండిపాటు

తదుపరి విచారణ ఈ నెల 30కి వాయిదా

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా విద్య పెద్ద వ్యాపారంగా మారిపోయిందని సోమవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించే అర్హత పరీక్ష ‘డీసెట్‌’తో సంబంధం లేకుండా ‘స్పాట్‌ అడ్మిషన్‌’ పేరుతో డీఈడీ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించడం ఏ మాత్రం సబబు కాదని తేల్చిచెప్పింది. 

► స్పాట్‌ అడ్మిషన్‌ అంటేనే దొడ్డిదారిన ప్రవేశం కల్పించడమని, ఇందుకు ఏ చట్ట నిబంధనలు కూడా అంగీకరించవని స్పష్టం చేసింది. 
► డీసెట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించని, అసలు పరీక్షే రాయని వారికి ‘స్పాట్‌ అడ్మిషన్‌’ పేరుతో ఎలా ప్రవేశాలు ఇస్తారని డీఈడీ కాలేజీ యాజమాన్యాలను నిలదీసింది. 
► 2018–19, 2019–20లకు ప్రభుత్వం అనుమతినివ్వనప్పుడు విద్యార్థులను ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించింది. 
► 2017–18 విద్యా సంవత్సరానికి అనుమతినిచ్చి నాటి ప్రభుత్వం తప్పు చేస్తే, మళ్లీ మళ్లీ ప్రభుత్వాన్ని అదే తప్పు చేయమంటారా అని నిలదీసింది. ఆ తప్పు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించమంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఆదేశాలు తాము ఎప్పుడూ ఇవ్వలేమంది. 
► స్పాట్‌ అడ్మిషన్లు పొందిన విద్యార్థులపై కూడా సానుభూతి చూపలేమని తేల్చిచెప్పింది. అవసరమైతే వారి నుంచి వసూలు చేసిన ఫీజులను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. 
► సింగిల్‌ జడ్జి వద్ద డీఈడీ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌లను తమ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాకేశ్‌కుమార్, జస్టిస్‌ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. 
► 2018–19, 2019–20 సంవత్సరాలకు తమ కాలేజీల్లో ప్రవేశాలను ప్రభుత్వం ఆమోదించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ డీఈడీ కాలేజీలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ వ్యాజ్యాలను సింగిల్‌ జడ్జి జస్టిస్‌ రజనీ తోసిపుచ్చారు. దీనిపై డీఈడీ కాలేజీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేయగా సోమవారం న్యాయమూర్తి జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. 
► ప్రభుత్వం తరపున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ విద్యార్థుల నుంచి ఈ డీఈడీ కాలేజీలు లక్షల రూపాయలు దోచేశాయన్నారు.  

మరిన్ని వార్తలు