రోడ్లపైనా రోత రాతలు! ‘ఈనాడు’ విషపు రాతలు

9 Aug, 2022 03:51 IST|Sakshi

బాబు హయాంలో కంటే ఈ మూడేళ్లలోనే ఎక్కువగా ‘పీఎంజీఎస్‌వై’లో రోడ్లు మంజూరు

ఆ ఐదేళ్లలో రోడ్లు 1,318 కి.మీ.లే.. కానీ, ఈ మూడేళ్లలో అంతకు రెట్టింపు పైగా..

అలాగే, గత మూడేళ్లలో 2,271 కి.మీ. మేర కొత్త రోడ్లు పూర్తి

కానీ, ‘పల్లెకు దారేదీ’ అంటూ ‘ఈనాడు’ విషపు రాతలు

రాష్ట్రానికి కొత్త రోడ్లు మంజూరు అంశంలోనూ అసత్యాలు

పనుల పురోగతిలేక కేటాయింపుల్లో కోత పెట్టినట్లు విషప్రచారం

కొత్త రోడ్ల మంజూరుకు పనుల పురోగతికి సంబంధం లేదన్న అధికారులు

మూడేళ్లలో కేంద్రం ఇచ్చిన నిధుల కంటే ఎక్కువగానే రాష్ట్ర ప్రభుత్వం రోడ్లకు ఖర్చు

సాక్షి, అమరావతి
► రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014–19 మధ్య కాలంలో ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన పథకం (పీఎంజీఎస్‌వై)తో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వ ఉమ్మడి నిధులతో రోడ్ల నిర్మాణం చేపట్టే ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకం ద్వారా 1,318 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు మంజూరైతే 2019 నుంచి ఇప్పటివరకు దాదాపు మూడేళ్లలో ఏకంగా 3,047 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు మంజూరయ్యాయి. 
► పీఎంజీఎస్‌వైతో పాటు ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకం ద్వారా 2014–19 మధ్య గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రూ.1,363 కోట్లను ఖర్చుచేస్తే.. ప్రస్తుత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మూడేళ్లలోనే రూ.1,321 కోట్లను వెచ్చించింది.
► ఆయా పథకాల ద్వారా రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం తన వాటాగా 2019–20లో రూ.179 కోట్లు విడుదలచేస్తే ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.339 కోట్లను ఆయా రోడ్ల నిర్మాణానికి ఖర్చుచేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.357 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఆ ఏడాది మొత్తం రూ.396 కోట్లు మేర పనులు పూర్తిచేసింది. ఇక 2021–22లో కేంద్రం రూ.99 కోట్ల మేర నిధులు విడుదల చేయగా అదే ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.508 కోట్ల మేర రోడ్ల నిర్మాణ పనులను పూర్తిచేసింది. మొత్తంగా 2022 మార్చి వరకు పీఎంజీఎస్‌వై పథకానికి కేంద్రం రూ.635 కోట్లు రాష్ట్రానికి విడుదలచేస్తే,  రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,243 కోట్ల పనులు పూర్తిచేసింది. ఇక 2022–23లో గత నాలుగు నెలల్లో రూ.78 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఇప్పటివరకు రూ.1,321 కోట్లు ఖర్చుచేసింది.

వాస్తవాలు ఇలా ఉంటే.. ‘ఈనాడు’ ఎప్పటిలాగే సగం వాస్తవాలను దాచి, మరికొన్ని అసత్యాలను కలిపి నాసిరకం కథనాన్ని వండివార్చింది. ఉద్దేశ్యపూర్వకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు కథనాలను తన పాఠకుల మీదకు రుద్దుతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా రోడ్లపై గుంతలన్నవి సర్వసాధారణం. కానీ, ఇప్పుడు ప్రత్యేకించి రోడ్ల విషయంలో నిత్యం విష ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది. తాజాగా.. ‘పల్లెకు దారేదీ’ అంటూ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని.. పనుల పురోగతి లేక రాష్ట్రానికి కేటాయింపుల్లో కత్తెర వేస్తోందంటూ రోడ్లపై రాసిన రోత రాతలు కూడా ఇందులో భాగమే.  

డీపీఆర్‌ల ఆధారంగానే పనులు మంజూరు
ఇక ‘ఈనాడు’ తన కథనంలో రాసినట్లు.. రోడ్డు పనుల పురోగతి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పీఎంజీఎస్‌వై పథకం ద్వారా రాష్ట్రాలకు కొత్తగా అదనపు రోడ్లు మంజూరు అన్నదే ఉండదని అధికార, ఇంజనీరింగ్‌ వర్గాలు స్పష్టంచేశాయి. రోడ్డు పనుల పురోగతి ప్రాతిపదికన కేంద్రం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులను విడతల వారీగా ఇస్తోందని.. అంతకుముందు విడుదల చేసిన నిధులలో కనీసం 60 శాతం ఖర్చుచేస్తే మరో విడత నిధులు మంజూరు విధానమే అమలు చేస్తోంది. అలాగే, కొత్త పనుల మంజూరులో, కేటాయింపులో కోత పెట్టడం అన్నదే ఉత్పన్నం కాదని అధికారులు విస్పష్టంగా చెప్పారు. మరోవైపు.. కేంద్రం ప్రతిపాదించిన మేరకు రాష్ట్రాలు డీపీఆర్‌లు పంపడం ప్రాతిపదికనే ఈ పథకం ద్వారా కొత్త రోడ్ల మంజూరు అన్నది ఉంటుందని వారు తేల్చిచెప్పారు.

రాష్ట్రానికి ముందే 3,285 కి.మీలు కేటాయింపు..
పీఎంజీఎస్‌వై పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చులో 60 శాతం కేంద్రం, మిగిలిన 40 శాతం రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. 2019లో పీఎంజీఎస్‌వై–3 కార్యక్రమాన్ని కేంద్రం మొదలుపెట్టి ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 1.25 లక్షల కిలోమీటర్ల పొడవున రోడ్ల నిర్మాణానికి సంబంధించిన కేటాయింపులను చేపట్టింది. మూడేళ్ల క్రితం రాష్ట్రాల వారీగా కేటాయింపులను ముందుగానే ప్రకటించింది. అలాగే, పీఎంజీఎస్‌వై–3 విడత ద్వారా ఏపీలో 3,285 కిలోమీటర్ల పొడవున రోడ్ల నిర్మాణానికి 2019లోనే ముందస్తు అనుమతులు ఇచ్చింది.

ఈ మేరకు రాష్ట్రంలో ఏయే ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టాలన్న దానిపై రాష్ట్రస్థాయిలో నిర్ణయం తీసుకుని అందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను సమర్పించగానే, వాటికి మంజూరు పత్రాలను జారీచేస్తోంది. ఆ 3,285 కిలోమీటర్ల రోడ్లకు గాను 2019 ఆర్థిక సంవత్సరంలో 935 కిలోమీటర్లు, 2020 ఆర్థిక సంవత్సరం చివరిలో మరో 1,378 కిలోమీటర్ల రోడ్లను మంజూరు చేయగా అందులో 1,149 కిలోమీటర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది.

పీఎంజీఎస్‌వై–3కు తోడు పీఎంజీఎస్‌వై–1, 2లతో పాటు ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకంలో కేంద్రం రాష్ట్రానికి ఈ మూడేళ్ల కాలంలో మరికొన్ని రోడ్లను కూడా కలిపి మొత్తం 3,047 కి.మీటర్లను మంజూరు చేసింది. ఇందులో 2,271 కి.మీటర్ల రోడ్ల నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిచేసింది. 

ఆ 25 కి.మీ. పీఎంజీఎస్‌వై రోడ్లే కాదు..
పీజీఎంజీఎస్‌వై–3లో రాష్ట్రానికి 3,285 కిలోమీటర్లు కేటాయింపులు ముందే జరగ్గా, ఇప్పటికే 2,314 కిలోమీటర్ల మేర రోడ్లకు అనుమతులు మంజూరై నిర్మాణంలో ఉన్నాయి. ఆ కేటాయింపుల్లో ఇంకా 971 కిలోమీటర్లు మంజూరు కావాల్సి ఉండగా, రాష్ట్ర పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు వాటికి సంబంధించి డీపీఆర్‌లను ఇప్పటికే కేంద్రానికి పంపారు. అయితే, రోడ్ల నిర్మాణంలో ఇటీవల కొత్తగా వచ్చిన టెక్నాలజీవల్ల రోడ్లు ప్రకారం కొత్త డీపీఆర్‌లు పంపాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్లు తెలిసింది.

ప్రస్తుతం ఆ డీపీఆర్‌ల అంశంలో కేంద్ర–రాష్ట్ర అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అతి త్వరలోనే ఆ 971 కిలోమీటర్ల నిర్మాణానికి అనుమతులు వచ్చే అవకాశముందని అధికారులు వెల్లడించారు. మరో రెండేళ్ల సమయం ఉన్నా మన రాష్ట్రానికి ముందే పూర్తిస్థాయిలో మంజూరవుతాయని వివరించారు.

ఇదిలా ఉంటే.. కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడం, పనుల పురోగతి లేక రాష్ట్రానికి గత ఏడాది కేవలం 25 కిలోమీటర్ల రోడ్లను మాత్రమే కేటాయించిందని పచ్చపత్రిక ‘ఈనాడు’ తన కథనంలో రాసిన పిచ్చిరాతలను చూసి అధికారులే నవ్వుకుంటున్నారు. ఆ 25 కిలోమీటర్లు ఆర్‌సీపీఎల్‌డబ్ల్యూఈఏ పథకంలో మంజూరైనవని, అప్పట్లో మంజూరై రద్దయిన వాటిని తిరిగి మంజూరు చేసినవని అధికారులు వివరించారు.   

మరిన్ని వార్తలు