సీఎం ప్రసంగంపై ‘ఈనాడు’ పైత్యం 

17 Aug, 2022 08:21 IST|Sakshi

లేని తప్పులు ఉన్నట్లు భ్రమించి అభాసుపాలు 

చంద్రబాబు ప్రసంగాల్లో లేక్కలేనన్ని తడబాట్లున్నా రామోజీకి అవి ఆణిముత్యాలు 

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పైత్యపు రాతలు రాయడంలో ఆరితేరిన ఈనాడు స్వాతంత్య్ర దినోత్సవం నాడు కూడా ఆ పైత్యాన్ని ప్రదర్శించింది. కోడిగుడ్డుపై ఈకలు పీకినట్లు సీఎం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో లేని తప్పుల్ని ఉన్నట్లు భ్రమించి దాన్నో కథనంగా వండి వార్చేసి అభాసుపాలైంది. ప్రతిరోజు చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగాల్లో అష్ట వంకర్లు, లెక్కలేనన్ని తడబాట్లు ఉన్నా వాటినే ఆణిముత్యాలుగా భావించి తాటికాయంత అక్షరాలతో ఆ పత్రికలో అచ్చేసుకోవడానికి అలవాటుపడ్డ రామోజీకి సీఎం జగన్‌ ప్రసంగంలో మాత్రం అన్నీ తడబాటుగానే కనిపించాయి.

గుంటూరులో టీడీపీ నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవంలో చంద్రబాబు ప్రసంగంలో చాలా తడబాట్లు ఉన్నా ఈనాడుకు అవి వేద మంత్రాల్లా వినిపించాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు స్వాతంత్య్రం వచ్చి ఎన్నేళ్లయిందో కూడా తెలియని విధంగా మాట్లాడిన మాటలు సోషల్‌ మీడియాలో కోడై కూస్తున్నా ఈనాడుకు మాత్రం అవి ఎంతో వినసొంపుగా వినిపించాయి. కానీ, స్వాతంత్య్రం వచ్చి వందేళ్లయినట్లు చంద్రబాబు చెప్పినా ‘సాక్షి’ మాత్రం హుందాగా వ్యవహరించి ఆ తప్పును ప్రచురించలేదు. అవేకాదు.. అలాంటి ఆణిముత్యాల్లాంటి తప్పులు చంద్రబాబు ప్రసంగంలో నిత్యం వస్తున్నా వాటిని సాక్షి ఏనాడూ వెల్లడించలేదు.

కానీ, ఈనాడు మాత్రం కావాలని సీఎం జగన్‌ ప్రసంగంలో లేని తప్పుల్ని ఉన్నట్లు రాసి ఆయనపై ఉన్న ఆక్రోశాన్ని, కడుపుమంటను వెళ్లగక్కింది. కొన్ని పదాలు పలకడంలో తడబాటుకు గురైనట్లు భావించి తానే తడబాటుకు గురైంది. వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన పదాల్లో తడబాటు లేకపోయినా సేద్యాన్ని స్వేద్వం, అభ్యుదయాన్ని అభ్యుద్వయం అన్నట్లు, ఇంకా పలు పదాలను పలకలేకపోయినట్లు కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేసింది. నిజానికి.. ఈ మూడేళ్లలో సీఎం కొన్ని వందల సభలు, సమావేశాలు, బహిరంగ సభల్లో ప్రసంగించారు. అప్పుడెప్పుడు ఈనాడుకు కనపడని తడబాటు ఒక్కసారిగా ఇప్పుడే కనిపించడం వెనుక సీఎం జగన్‌పై విషప్రచారం చేయడమే రామోజీ ఉద్దేశంగా కనపడుతోంది.    

ఇది కూడా చదవండి: వామ్మో 'బాబు' ఆణిముత్యాలు వింటే షాక్‌ అవ్వాల్సిందే..

మరిన్ని వార్తలు