ఉత్త.. రాతల ప్రేమ

13 Oct, 2022 04:06 IST|Sakshi

పథకం ప్రకారం ‘ఈనాడు’ ప్రభుత్వ వ్యతిరేక కథనాలు 

గడిచిన ఆరు రోజుల్లో 5 రోజులు ఉత్తరాంధ్ర ప్రస్తావనే 

విశాఖలో దసపల్లా భూములంటూ మళ్లీ మళ్లీ రాతలు 

ఉత్తరాంధ్రకు విద్య, ఇరిగేషన్‌ ప్రాజెక్టులు తెచ్చింది బాబేనట 

ఆ రెండింట్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ విమర్శలు 

‘విశాఖ రాజధాని’ నినాదంపై దృష్టి మరల్చేందుకు తంటాలు 

అమరావతి యాత్రకు ఇబ్బందులొస్తాయని టీడీపీ అనుమానాలు 

ఆ పరిస్థితి నివారించడానికి పవన్‌ను పంపుతున్న టీడీపీ 

రెండ్రోజుల్లో వచ్చి డైలాగులకు సిద్ధమవుతున్న పవన్‌కల్యాణ్‌ 

ఆ ‘సీన్‌’ కోసం వ్యతిరేక వార్తలతో రంగం సిద్ధం చేస్తున్న ‘ఈనాడు’ 

జేఏసీ ఉద్యమ కార్యాచరణకు జనం కలిసిరాకూడదని వ్యూహం 

రామోజీ రాతలతో రెచ్చిపోయి ‘సేవ్‌ ఉత్తరాంధ్ర’ అంటున్న బాబు 

ఏది నిజం?

ఎంత ప్రేమ.. ఎంత ప్రేమ!!. రామోజీరావుకు ఉత్తరాంధ్ర అంటే మరీ ఇంత ప్రేమా!. గడిచిన ఆరు రోజుల్లో ఐదు రోజులు ఉత్తరాంధ్ర వ్యవహారాలే ‘ఈనాడు’ బ్యానర్‌గా మారాయి మరి!. ప్రభుత్వం ఉత్తరాంధ్రను పట్టించుకోవటం లేదంటూ పేజీలకు పేజీలు పచ్చి అబద్ధాలు!!.  ఇదంతా ఎందుకు రామోజీరావు గారూ? విశాఖ వాసుల్లో వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వంపై వ్యతిరేకత నింపి మీ చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ వచ్చేసరికి రంగం సిద్ధం చేయటానికా? వైఎస్సార్‌ సీపీ తలపెట్టిన బహిరంగ సభ విజయవంతం కాకూడదనే నిష్ఫల ప్రయత్నమా? లేక రాజధాని కోసం ఉద్యమిస్తున్న ఉత్తరాంధ్ర వాసుల దృష్టిని మళ్లించడానికా? ఎందుకిదంతా? 

మాకు తప్ప మీకెవ్వరికీ రాజధానిని అడిగే అర్హత లేదంటూ ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్న చంద్రన్న ముఠాల కోసమేగా ఈ రాతలు? ఎవడ్రా మమ్మల్ని అడ్డుకునేదని తొడలు కొట్టుకుంటూ వస్తున్న నారీ మణుల కోసమేగా ఈ అబద్ధాలు? మరీ ఇంత దిగజారుడు తనమా? ఒక ప్రాంతం అభివృద్ధి చెందకూడదని మరీ ఇంత కక్ష చూపించాలా? వారం రోజులుగా మీరు గుప్పిస్తున్న వార్తారాజాల్లో వక్రీకరణ ఏ స్థాయిలో ఉందో తెలియనిదెవరికని? 

ఇదే... ఉత్తరాంధ్రపై ప్రేమ
ఉత్తరాంధ్రపై చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌ చూపిస్తున్న ప్రేమకు మురిసిపోతున్నదెవరైనా ఉంటే... అందులో ‘ఈనాడు’ పత్రిక, దాని అధిపతి రామోజీరావుదే ఫస్ట్‌ మార్క్‌. ఎందుకంటే పవన్‌కల్యాణ్‌ పదేపదే శ్రీకాకుళం జిల్లా ఉద్ధానానికి వెళుతూ... అవసరాన్ని మించి ఆవేశపడుతూ ఉండేవారు. కానీ చంద్రబాబు ఏలిన ఐదేళ్లూ ఆవేశాన్ని ఆపేసుకున్నారు. రామోజీరావు కూడా తాత్కాలికంగా ఉద్ధానాన్ని, అక్కడి కిడ్నీ బాధితులను మరిచిపోయారు. మళ్లీ ఇప్పుడు మాత్రం... ఉత్తరాంధ్రకు ప్రస్తుత ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆవేశపడి డైలాగ్‌లు చెప్పేందుకు పవన్‌ సిద్ధం కాగా... పవన్‌ చెప్పేది నమ్మండని చెప్పటానికి రామోజీ రాతలు మొదలెట్టారు.

ఐదేళ్లూ కిడ్నీ బాధితుల్ని చంద్రబాబు మరిచిపోవటం అబద్ధమా రామోజీరావు గారూ? కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నా మంచినీటి సమస్యను పట్టించుకున్నారా? పాదయాత్రలో బాధితులకిచ్చిన హామీ మేరకు... వై.ఎస్‌.జగన్‌ అధికారంలోకి వచ్చాకపలాసలో 200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ వ్యాధుల రీసెర్చ్‌ సెంటర్, 65 మంది రోగులకు ఏకకాలంలో ఉపయోగపడేలా అతిపెద్ద డయాలసిస్‌ సెంటర్‌ను మంజూరు చేయటం మీకు కనిపించదా? వాటి పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి కదా? కొద్ది రోజుల్లో ఇది పూర్తయి వారి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తున్న విషయాన్ని మీ పత్రిక చెప్పదెందుకు? ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకు ప్రధాన కారణం తాగునీరేనని అన్ని కమిటీలూ చెబుతున్న నేపథ్యంలో పలాస, ఇచ్ఛాపురం పరిధిలోని 7 మండలాల్లోని 807 గ్రామాలకు రక్షిత మంచినీరు అందించడానికి రూ.700 కోట్లతో నిర్మాణాలు చేపడుతున్నది ఈ ప్రభుత్వమేగా? ఆసుపత్రి, డయాలసిస్‌ సెంటర్లకు మరో రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నది వాస్తవం కాదా? నిజాలు పక్కనబెట్టి అబద్ధాలతో ఎన్నాళ్లిలా చెలరేగిపోతారు? ఉత్తరాంధ్ర జిల్లాల సంఖ్యను 3 నుంచి 6కు పెంచటమే కాక జిల్లాకో మెడికల్‌ కాలేజీని తీసుకువస్తున్నది ఈ ప్రభుత్వమేనని జనానికి తెలియదనుకుంటున్నారా?

ప్రాజెక్టుల ఘనత చంద్రబాబుదా?
అసలు చంద్రబాబు ముఖ్యమంత్రయిందెప్పుడు రామోజీ? 1995లో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి... పద్నాలుగేళ్లు సీఎం అని డప్పు కొట్టే మీరు... ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తయిందని చెప్పగలరా? ఇది తాను తెచ్చిన ప్రాజెక్టని ఒక్కటైనా చంద్రబాబు చెప్పుకునే పరిస్థితి ఉందా? పైపెచ్చు సీఎం అయిన 27 ఏళ్ల తరవాత ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయలేదని కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ వేరొకరిపై నిందలేయటం కన్నా దౌర్భాగ్యం వేరొకటి ఉంటుందా? 

ఇవిగో... ప్రాజెక్టుల వాస్తవాలు
► వంశధార ప్రాజెక్టును మొదలుపెట్టింది దివంగత నేత వైఎస్సార్‌. అరవై శాతం పూర్తి చేశారు కూడా. టీడీపీ ఐదేళ్లలో మిగిలిన 40 శాతం పూర్తి చేయలేకపోయింది. వచ్చే 4–6 నెలల్లో ఈ ప్రభుత్వం వాటిని పూర్తి చేయబోతోంది.

► వంశధార–నాగావళి అనుసంధాన పనులు ఐదేళ్లలో కనీసం 30 శాతం కూడా టీడీపీ చేయని మాట అబద్ధమేమీ కాదు. ఈ ప్రభుత్వం వచ్చే 4–6 నెలల్లో పూర్తి చేయనున్నదనేదీ నిజమే. 

► మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ వైయస్సార్‌ మొదలుపెడితే టీడీపీ ప్రభుత్వం కనీసం 40 శాతం కూడా చేయకుండా
గాలికి వదిలేసింది. ఇపుడు రూ. 840 కోట్లతో రివైజ్డ్‌ శాంక్షన్‌ చేసి టెండర్లకు వెళుతోంది ఈ ప్రభుత్వం. 

► తారకరామ తీర్థసాగర్‌ ప్రాజెక్టు పనులు టీడీపీ ప్రభుత్వం చేయకపోతే కోర్టుకెళ్లారు. అది కూడా ఈ ప్రభుత్వానికే అంటగట్టబోయారు రామోజీరావు. కోర్టు సమస్యను పరిష్కరించింది ఈ ప్రభుత్వమే. రివైజ్డ్‌ శాంక్షన్‌ ఇచ్చి ముందుకెళ్తున్నదీ ఈ ప్రభుత్వమే.

►  గజపతినగరం బ్రాంచ్‌ కెనాల్‌ కూడా టీడీపీ ప్రభుత్వం వదిలేస్తే ఈప్రభుత్వం రివైజ్డ్‌ శాంక్షన్‌ ఇచ్చి ముందుకెళ్తోంది. 

► ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని మంజూరు చేసింది వైయస్సార్‌. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనిది టీడీపీ. రూ.1700 కోట్లతో ప్రాజెక్టు శాంక్షన్‌ చేసి భూ సేకరణ వేగంగా చేస్తున్నది ఈ ప్రభుత్వమే. డిజైన్లు కూడా పూర్తవుతున్నాయి.

► తోటపల్లి ప్రాజెక్టు కాంగ్రెస్‌ హయాంలోనే 95 శాతం పూర్తయితే అది బాబు ఘనతగా చెబుతోంది ‘ఈనాడు’. మిగిలిన పనులు రెండు ప్యాకేజీలుగా చేసి పనులు చేపట్టింది ఈ ప్రభుత్వమే.   

మరిన్ని వార్తలు