టీడీపీ హయాంలో  రూ.31.14 కోట్ల మందులు వృథా! 

5 May, 2022 03:40 IST|Sakshi

అప్పటి తప్పిదాలను ప్రభుత్వంపై రుద్దాలని చూస్తున్న ఈనాడు 

సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలుగా చూపి పచ్చ పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరులోని సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌ (సీడీఎస్‌)లో రూ.కోట్ల విలువజేసే ఉచిత మందులకు చెద పట్టిందని ఈనాడు ఓ కథనాన్ని బుధవారం ప్రచురించింది. 2019, 2020 సంవత్సరాల్లో కొనుగోలు చేసిన ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, సిరంజులు, సెలైన్‌ బాటిళ్లు, సర్జికల్స్‌ వృథాగా మారాయంటూ గగ్గోలు పెట్టారు. అయితే ఆ మందులన్నీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2019కు ముందు వివిధ రకాల పథకాలు, పుష్కరాల కోసం కొనుగోలు చేసిన స్టాక్స్‌గా ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు స్పష్టం చేశారు. అప్పట్లో సకాలంలో వినియోగించకపోవడం వలన సీడీఎస్‌లో వినియోగంలో ఉన్న మందులకు దూరంగా ఉంచామని పేర్కొన్నారు.

2016 నుంచి 2019 మధ్య అప్పటి అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రూ.31,14,06,713.04 విలువైన మందులు వృథాగా మారాయని తెలిపారు.  కరోనా చికిత్సకు ఉపయోగించే కొన్ని రకాల మందులు కేంద్ర ప్రభుత్వం, ప్రైవేట్‌ ఏజెన్సీల నుంచి సప్లై చేయగా ఆ మందులు కరోనా ఆస్పత్రుల్లో వినియోగించకపోవడంతో ఎక్స్‌పెయిర్‌ అయ్యాయన్నారు. అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి వాటి రిపోర్ట్‌కు అనుగుణంగా గత 10–15 సంవత్సరాల నుంచి నిల్వ ఉంచిన కాలంచెల్లిన మందులు, సర్జికల్స్‌ను కాలుష్య నియంత్రణ బోర్డు  గుర్తించిన ఏజెన్సీల ద్వారా డిస్పోజ్‌ చేస్తున్నామన్నారు.  ఫస్ట్‌ ఎక్స్‌పెయిర్‌ ఫస్ట్‌ అవుట్‌ నిబంధన ప్రకారం మాత్రమే అన్ని జిల్లాల్లోని మందులు ఆస్పత్రులకు సరఫరా చేస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో ప్రస్తుత మందుల వినియోగానికి మాత్రమే కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రజలు అపోహలను నమ్మొద్దని ఏపీఎంస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి కోరారు.    

మరిన్ని వార్తలు