25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక 

20 Sep, 2021 03:26 IST|Sakshi

ఎంపీపీల ఎన్నిక 24న 

పరోక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన ఎస్‌ఈసీ  

అదే రోజు ప్రమాణ స్వీకారం.. ఆ వెంటనే కో ఆప్టెడ్, ఉపాధ్యక్ష, వైస్‌ చైర్మన్ల ఎన్నికలు కూడా   

ఎక్కడైనా కో ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నిక జరగని పక్షంలో అక్కడ ఎంపీపీ, జెడ్పీ చైర్మన్‌ ఎన్నికలూ వాయిదా

అలాంటి చోట మర్నాడు నిర్వహణ  

సాక్షి, అమరావతి:  పరిషత్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి కావడంతో పరోక్ష పద్ధతిలో జరిగే మండల పరిషత్‌ అధ్యక్ష(ఎంపీపీ), జిల్లా పరిషత్‌ (జెడ్పీ) చైర్మన్‌ పదవులకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదివారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 24న ఎంపీపీ, 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నిక జరిగే రోజే మండల కో ఆప్టెడ్‌ సభ్యుడు, మండల ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు జరుగుతాయి. ఇక జెడ్పీ చైర్మన్‌ ఎన్నిక నిర్వహించే రోజే ప్రతి జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్‌ సభ్యులు, ఇద్దరు వైస్‌ చైర్మన్ల ఎన్నిక జరుగనుంది.  

ప్రమాణ స్వీకారం ముగియగానే కో ఆప్టెడ్‌ ఎన్నిక 
మండల పరిషత్‌లలో 24వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే రోజు కో ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నిక జరుగుతుంది. ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల కోసం సాయంత్రం విడిగా సమావేశం నిర్వహిస్తారు.  

జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్లకు విడిగా ఎన్నిక  
25వతేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అన్ని జిల్లా పరిషత్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించి కొత్తగా జెడ్పీటీసీ సభ్యులుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అదే సమావేశంలో ఇద్దరు కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక జరుగుతుంది. సాయంత్రం విడిగా సమావేశం నిర్వహించి జెడ్పీ చైర్మన్, ఇద్దరు వైస్‌ చైర్మన్ల ఎన్నిక చేపడతారు.  

వాయిదా పడ్డ చోట్ల మర్నాడు నిర్వహణ 
ఒకవేళ ఏదైనా కారణాలతో ఉదయం కో ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నిక జరగని పక్షంలో ఆయా మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లలో సాయంత్రం జరగాల్సిన ఎంపీపీ, ఉపాధ్యక్ష, జెడ్పీ చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎన్నికలను కూడా వాయిదా వేసి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. మండల పరిషత్‌లో 24వ తేదీన కో ఆప్టెడ్‌ సభ్యుడితో పాటు ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవుల ఎన్నిక వాయిదా పడిన పక్షంలో మరుసటి రోజు 25వ తేదీన నిర్వహించేందుకు రిటర్నింగ్‌ అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో ఆదేశించారు. జిల్లా పరిషత్‌లలో 25వ తేదీన జరగాల్సిన ఎన్నిక వాయిదా పడిన పక్షంలో 26వ తేదీన ఎన్నికలు నిర్వహించేందుకు స్థానిక రిటర్నింగ్‌ అధికారి చర్యలు చేపట్టాలని సూచించారు.  

మరిన్ని వార్తలు