భయాందోళనల వల్ల కొత్త కేసులు నమోదవుతున్నాయి

8 Dec, 2020 11:15 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: గత కొద్ది రోజులుగా ఏలూరు పరిసరాల్లో ప్రజలు అంతు చిక్కని వ్యాధి బారిన పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇక్కడ పరిస్థితులను పర్యవేక్షించడానికి గాను దేశంలోని అనేక ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి వైద్యులు, శాస్త్రవేత్తల బృందాలు చేరుకున్నాయని డీసీహెచ్‌ఎస్‌ ఏవీఆర్‌ మోహన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం కొత్తగా వస్తున్న కేసుల సంఖ్య తగ్గడమే కాక డిశ్చార్జిల సంఖ్య పెరిగిందన్నారు. దేశంలోని పలు ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి బృందాలు వచ్చి నమోదు అయిన కేసుల వివరాలు తెలుసుకుని శాంపిల్స్‌ సేకరిస్తున్నారని తెలిపారు. అంతేకాక డబ్ల్యూహెచ్‌ఓ నుంచి ఇద్దరు ప్రతినిధులు వచ్చారని తెలిపారు. ఇక్కడ నుంచి వాటర్‌, మిల్క్‌ శాంపిల్స్‌ సేకరించి న్యూఢిల్లీ ఎయిమ్స్‌కు పంపుతామన్నారు. పూణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి నిపుణులు వస్తారని తెలిపారు మోహన్‌. (చదవండి: అనుక్షణం అప్రమత్తం )

ప్రస్తుతం ఇక్కడ బాధితులకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు ఏవీఆర్‌ మోహన్‌. డిశ్చార్జి అయిన వారిని కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని.. అన్ని ప్రాంతాల్లో 108 వాహనాలు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రస్తుతానికి ప్రాథమిక నివేదిక వచ్చిందని.. కొత్తగా మరో 40 మంది బాధితుల శాంపిల్స్‌ సేకరించి పంపిచామన్నారు. పూర్తిగా నిర్దారణ లేకుండా నివేదికలు బయటకు వెల్లడించలేమన్నారు. భయాందోళనవల్ల కూడా కొత్త కేసులు నమోదవుతున్నాయని తెలిపారు మోహన్‌.

మరిన్ని వార్తలు