ముగిసిన భారత్‌–ఆస్ట్రేలియా యుద్ధ విన్యాసాలు

6 Nov, 2022 06:30 IST|Sakshi
యుద్ధ విన్యాసాల్లో భారత్‌–ఆస్ట్రేలియా త్రివిధ దళాలు

ఇండో పసిఫిక్‌ ఎండీవర్‌–2022లో భాగంగా విశాఖలో ఆస్ట్రేలియా నౌకాదళం

చివరి రోజు విన్యాసాల్లో పాల్గొన్న రాయల్‌ ఆస్ట్రేలియా త్రివిధ దళాలు

సాక్షి, విశాఖపట్నం: భారత్‌–ఆస్ట్రేలియా రక్షణ దళాల మధ్య నిర్వహించిన మారీటైమ్‌ విన్యాసాలు శనివారం ముగిశాయి. విశాఖ తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం సమీపంలోని బంగాళాఖాతం తీరం ఈ విన్యాసాలకు వేదికైంది. ఇండో పసిఫిక్‌ ఎండీవర్‌(ఐపీఈ)–2022లో భాగంగా గత నెల 30న రాయల్‌ ఆస్ట్రేలియా రక్షణ దళాలు విశాఖ చేరుకున్నాయి.

శనివారం నిర్వహించిన విన్యాసాల ముగింపు నేపథ్యంలో రాయల్‌ ఆస్ట్రేలియన్‌ నేవీకి చెందిన హెచ్‌ఎంఏఎస్‌ అడిలైడ్, హెచ్‌ఎంఏఎస్‌ అంజాక్‌ యుద్ధ నౌకలు, తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌ జలాశ్వ, ఐఎన్‌ఎస్‌ కవరత్తి యుద్ధ నౌకలతో పాటు హెలికాప్టర్లు విన్యాసాల్లో పాల్గొని సత్తా చాటాయి. చివరి రోజు విన్యాసాల్లో ఆస్ట్రేలియా, భారత్‌కు చెందిన త్రివిధదళాలు పాల్గొన్నాయి.

ఈ సందర్భంగా భారత్‌కు చెందిన యుద్ధ నౌకల్ని ఆస్ట్రేలియా రక్షణ బృందం సందర్శించాయి. హార్బర్‌ ఫేజ్‌లో ఉమ్మడి రక్షణ ప్రణాళికలు, పరస్పర అవగాహన ఒప్పందాలు, రక్షణ వ్యవస్థలో సహకార చర్యలు మొదలైన అంశాలపై చర్చించినట్లు తూర్పు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. 

మరిన్ని వార్తలు