విహారయాత్రలో విషాదం: అంతవరకు ఆనందంగా గడిపిన క్షణాలు.. ఒక్క అల రాకతో..

22 Nov, 2021 10:01 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భావనపాడు తీరంలో స్నానానికి దిగి విద్యార్థి మృతి

మృతుడు బరంపురం వాసి

సురక్షితంగా ఒడ్డుకు చేరిన మరో యువకుడు 

సాక్షి, సంతబొమ్మాళి(శ్రీకాకుళం): మండలంలోని భావనపాడు సముద్ర తీరంలో ఆదివారం స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో శేఖర్‌ కుమార్‌ బెహరా (21) మృతి చెందగా.. మరొకరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. ఒడిశాలోని సెంచూరియన్‌ యూనివర్సిటీలో అగ్రికల్చరల్‌ బీఎస్సీ చదువుతున్న 50 మంది విద్యార్థులు బస్సులో ఆదివారం బీచ్‌కు వచ్చారు. భోజనాల అనంతరం విద్యార్థులు సముద్రంలో స్నానాలకు దిగారు.

ఇంతలో ఓ రాకాసి అల తాకిడికి శేఖర్‌కుమార్, ముక్తా ప్రధాన్‌తో పాటు మరికొందరు విద్యార్థులు చెల్లాచెదురైపోయారు. కాసేపటికే అంతా ఒడ్డుకు చేరుకున్నారు. అయితే శేఖర్‌ మునిగిపోతున్నాడని గ్రహించిన ముక్తా ప్రధాన్‌ అతడిని కాపాడే ప్రయత్నంలో తాను కూడా అలల మధ్య చిక్కుకున్నాడు. దీంతో అక్కడే ఉన్న స్నేహితులు ఎలాగోలా కష్టపడి ముక్తాను రక్షించగలిగారు. కానీ శేఖర్‌ను మాత్రం ఒడ్డుకు తీసుకురాలేకపోయారు. సాయంత్రం సమయంలో మృతదేహం ఒడ్డుకు చేరడంతో అంతా బోరుమన్నారు. శేఖర్‌కుమార్‌ స్వస్థలం బరంపురం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేశామని, మృతుడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని నౌపడ ఎస్‌ఐ సాయికుమార్‌ తెలిపారు.   

చదవండి: ప్రేమవివాహం సాఫీగా సాగిన జీవనం.. ఇటీవల కష్టంగా ఉందని లెటర్‌ రాసి..

మరిన్ని వార్తలు