కరోనా బాధిత కార్మిక కుటుంబాలకు ఈఎస్‌ఐసీ పింఛన్‌

29 Jul, 2021 04:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనాతో మృతిచెందిన కార్మికులపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు పింఛను ఇచ్చేందుకు కార్మికరాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) ప్రత్యేక పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. 2020 మార్చి 23న ప్రారంభించిన ఈ పథకం రెండేళ్లు అమల్లో ఉంటుందని వైఎస్సార్‌సీపీ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ మంత్రి రామేళ్వర్‌ తేలి  సమాధానమిచ్చారు. ఓబీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వరంగ సంస్థల అధికారులకు క్రీమీలేయర్‌ నిబంధన ఒకేలా వర్తిస్తుందని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర సామాజిక న్యా యశాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్‌ తెలి పారు.  15వ ఆర్థికసంఘం సూచనల మేరకు ప్రతి రాష్ట్రంలో ఒక కొత్త నగరం ఏర్పాటు చేయనున్నట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు  కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ సహా యమంత్రి కౌశల్‌ కిషోర్‌ సమాధానమిచ్చారు.

ఏపీలో 8 ఎంసీసీలు
ఆంధ్రప్రదేశ్‌లో 8 ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజీలను మోడల్‌ కెరీర్‌ సెంటర్స్‌ (ఎంసీసీ)గా అభివృద్ధి చేసేందుకు ఒక్కోదానికి రూ.50 లక్షలను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని బీజేపీ సభ్యుడు సీఎం రమేశ్‌ ప్రశ్నకు మంత్రి రామేశ్వర్‌ తేలి చెప్పారు. విశాఖపట్టణం సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రక్షణశాఖ పరిధిలోని భూముల్లో 29 పౌర విమానాశ్రయాలు ఉన్నాయని బీజేపీ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చారు. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని దేశంలో మౌలిక సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు టీడీ పీ సభ్యుడు కె.రవీంద్రకుమార్‌ ప్రశ్నకు  మంత్రి రామేశ్వర్‌ తేలి సమాధానమిచ్చారు. కాకినాడ వద్ద రిఫైనరీ, పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనని బీజేపీ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నకు  కేంద్రమంత్రి రామేశ్వర్‌ తేలి చెప్పారు. 

లోక్‌సభలో కోవిడ్‌ బీప్‌ ఉత్పత్తికి చర్యలు
కరోనా రోగుల ఆరోగ్య పర్యవేక్షణ పరికరం ‘కోవిడ్‌ బీప్‌’ పెద్దసంఖ్యలో ఉత్పత్తికి చర్యలు చేపట్టినట్లు కేంద్ర అణుశక్తిశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్‌ తెలిపారు. 100 పరికరాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ ఎంపీలు చింతా అనూరాధ, ఆదాల ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. శక్తి పాలసీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు కేటాయిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ సభ్యుడు వైఎస్‌ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు సమాధానంగా కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్‌ ధ్రువపత్రాలపై బహుపాక్షిక నిర్ణయం తీసుకోలేదని వైఎస్సార్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి వి.మురళీధరన్‌ తెలిపారు.

సుప్రీంకోర్టులో దాఖలయ్యే రివ్యూ, క్యురేటివ్‌ పిటిషన్లకు సంబంధించి రికార్డు మెయింటైన్‌ చేయబోమని వైఎస్సార్‌సీపీ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నకు జవాబుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు చెప్పారు. ఈఏడాది మే నుంచి జూన్‌ వరకు ఇస్రో 30 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ చేసిందని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎన్‌.రెడ్డెప్ప, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బి.వి.సత్యవతి, లావు శ్రీకృష్ణదేవరాయులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రధాని కార్యాలయ సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు