పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధం..

18 Oct, 2021 10:22 IST|Sakshi

అమ్మ పండగకు సిద్ధం

పట్టు వస్త్రాలు సమర్పించనున్న పూసపాటి వంశీయులు, మంత్రులు

ఆన్‌లైన్‌ టిక్కెట్లు ఉన్న వారికే దర్శనాలు

ఏర్పాట్లు పూర్తి : ఈఓ   

సిరుల తల్లి పండగంటేనే ఆనందం. ఉత్తరాంధ్ర ప్రజల ఇష్ట దైవం, భక్తుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవానికి తెర లేచింది. సోమవారం జరగనున్న తొలేళ్ల ఉత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

సాక్షి, విజయనగరం టౌన్‌: భక్తుల కొర్కెలు తీర్చే పైడితల్లి అమ్మవారి తొలేళ్ల ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలి(ఏరు)తో తొలిత దున్నాలి. దానినే తొలి ఏరు అని... తొలేళ్లనీ పిలుస్తారు. అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. పంటకు ఎలాంటి విపత్తులూ, చీడపీడల బాధలూ.. దరి చేరకూడదనేది రైతు కోరిక. వారి కోసం నిర్వహించేదే తొలేళ్ల ఉత్సవం. తొలేళ్ల రోజు రాత్రి చదురు గుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెళ్లారు. అక్కడ కోటకి పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. సిరిమాను పూజారి చేతుల తో ఆ విత్తనాలను అందించి అమ్మ ఆశీర్వదిస్తుంది. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాలలో కలిపి పొలా ల్లో చల్లుతారు, మంచి దిగుబడులు సాధిస్తారు.   

పండగ శోభ 
విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరంలో ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం  పైడితల్లి అమ్మవారికి పండగ రోజుల్లో మొక్కుబడులు చెల్లించేందుకు వచ్చే భక్తులతో పండగ శోభ సంతరించుకుంది.  రైల్వేస్టేషన్‌ వద్ద ఉన్న వనంగుడి ప్రదేశం, మూడు లాంతర్లు వద్ద ఉన్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్‌ శోభతో అలరాడుతోంది. భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటూ పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో సచివాలయ వ్యవస్థ ద్వారా టికెట్లను అందుబాటులో ఉంచారు.  ఆలయం వద్దనే రెండు ఆన్‌లైన్‌ కౌంటర్లు పెట్టి  టికెట్లు అందజేస్తున్నారు.  అమ్మవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పజాతులతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసే పనిలో కొంతమంది ఉంటే,  ప్రసాదాల తయారీలో మరికొందరు, సేవలకు సిద్ధంగా ఇంకొందరు  ఇలా తలా బాధ్యత  అమ్మ సేవలో నిమగ్నమయ్యారు.  చల్లని తల్లి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజలు, అధికారులు, నాయకులు సన్నద్ధమయ్యారు.  

 

తొలేళ్ల రోజు ప్రధాన ఘట్టాలు 
►వేకువ జామున 3 గంటల నుంచి అమ్మ వారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు. 
ఉదయం రాజవంశీకులు, మంత్రులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు. 
►రాత్రి 10.30 గంటలకు భాజా భజంత్రీలతో అమ్మవారి ఘటాలకు పూజలు చేసేందుకు కోటలోకి పూజారులు వెళ్తారు. కోటశక్తికి, అమ్మవారి ఘటాలకు పూజాధికాలు         నిర్వహిస్తారు. 
►ఘటాలను తిరిగి చదురుగుడి వద్దకు తీసుకువచ్చి గుడి ఎదురుగా ఉన్న బడ్డీలా ఏర్పాటు చేసిన వాటిపై ఉంచుతారు. అమ్మవారి దర్శనానికి అవకాశం లేని వారందరూ అక్కడే పసుపు, కుంకుమలను సమర్పించి, మొక్కులు చెల్లిస్తారు.  
►ఘటాలను తీసుకువచ్చిన తర్వాత పూజారి అమ్మవారి చరిత్ర చెప్పి రైతులకు ధాన్యాన్ని పంచుతారు. రైతులు ఆ విత్తనాల కోసం బారులు తీరుతారు. 

నేడు, రేపు మద్యం దుకాణాల బంద్‌
విజయనగరం అర్బన్‌: పైడితల్లమ్మ సిరిమాను ఉత్సవం నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో   ఉన్న సమీపంలోని మద్యం దుకాణాలు మూసి వేయించాలని ప్రొహిబిషన్, ఎక్సైజ్‌ శాఖ అధికారులను కలెక్టర్‌  సూర్యకుమారి ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశా రు. ఉత్సవాలు జరిగే రెండు రోజుల్లో మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధి, నగరాని కి సమీపంలో ఉన్న మద్యం దుకాణాలు, బార్లు, కళ్లు దుకాణాలు తెరవరాదని సూచించారు. శాంతి భద్రత ల కాపాడేందుకు, ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

ఉత్సవ ఏర్పాట్లు పూర్తి 
అమ్మవారి తొలేళ్లు, పైడితల్లి సిరిమాను ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశాం.  జాతర రెండు రోజులు ప్రత్యేక ఆంక్షలు ఉండడం వలన సచివాలయాల్లో అమ్మవారి దర్శనం టికెట్లను అందిస్తున్నాం. పది వేల లడ్డూ ప్రసాదాలను, పులిహోర ప్యాకెట్లను అందుబాటులో ఉంచు తున్నాం.  మాస్క్‌లు, శానిౖటైజర్లు అందుబాటులో ఉంచుతున్నాం.  
– బిహెచ్‌విఎస్‌ఎన్‌.కిశోర్‌కుమార్, ఈఓ, పైడితల్లి అమ్మవారి దేవస్ధానం

 

మూడంచెల పోలీస్‌ భద్రత 
సాక్షి, విజయనగరం: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవాల్లో  కీలక ఘట్టమైన తొలేళ్లు, సిరిమానోత్సవానికి సంబంధించి  మూడంచెల పోలీస్‌ భద్రత కల్పిస్తున్నట్లు ఎస్పీ ఎం.దీపిక స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రకటన విడుదల చేశారు.  ఉత్సవాన్ని శాంతియుతంగా నిర్వహించేందుకు బందోబస్తును 20 సెక్టార్లుగా విభజించి, సుమారు 2,500 మంది పోలీసులను రెండు షిప్టులుగా విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.  బందోబస్తులో  ఇద్దరు అదనపు ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 55 మంది సీఐలు/ఆర్‌ఐలు, 136 మంది ఎస్‌ఐ/ఆర్‌ఎస్‌ఐలు, 414 మంది ఏఎస్‌ఐ/హెచ్‌సీలు, 652 మంది కానిస్టేబుళ్లు, 144 మంది మహిళా కానిస్టేబుళ్లు, 365 మంది హోంగార్డులు, 105 మంది ఎస్‌టీఎఫ్‌ పోలీసు సిబ్బంది,  155 మంది ఆర్మ్‌డ్‌ రిజర్వు పోలీసు,  25 మంది పీఎస్‌ఓలు, 10 మంది బాంబ్‌ డిస్పోజల్‌ బృందాలు, 25 మంది కమ్యూనికేషన్‌ సిబ్బందితో సహా సుమారు 2,500 మంది  పోలీస్‌ అధికారులను, సిబ్బందిని బందోబస్తు నిమిత్తం వినియోగిస్తున్నామని పేర్కొన్నారు.  మొత్తం బందోబస్తును పర్యవేక్షించేందుకు పార్వతీపురం ఓఎస్‌డీ ఎన్‌.సూర్యచంద్రరావును నియమించామన్నారు.  అదనపు ఎస్పీ (పరిపాలన) పి.సత్యనారాయణరావును కమాండ్‌ కంట్రోల్‌ పర్యవేక్షణకు నియమించామని పేర్కొన్నారు.  అమ్మవారి సిరిమానోత్సవ బందోబస్తు విధులను నిర్వహించేందుకు విశాఖ సిటీ, రూరల్, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా పోలీస్‌ అధికారులు, సిబ్బంది వస్తున్నట్లు తెలిపారు.  ప్రజలంద రూ ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకుని పోలీసు శాఖకు, ఇతర శాఖలకు సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.  

19న దర్శనాల నిలిపివేత 
ఈ నెల 19న ఉదయం 11 గంటల నుంచి సిరిమానోత్సవం ముగిసే వరకూ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయంలో  దర్శనాలు  నిలిపివేస్తున్నందున, భక్తులెవరూ ఆ సమయంలో దర్శనాల కోసం ప్రధా న దేవాలయానికి రావద్దని ఎస్పీ సూచించారు. 

చెక్‌పోస్టుల ఏర్పాటు 
కోవిడ్‌ 19 వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా అంతర్‌ రాష్ట్ర, జిల్లా  సరిహద్దుల్లోనూ, అంతర్‌ మండలాల్లోనూ చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి, తనిఖీలు చేపట్టి, వాహనాల రాకపోకలను నియంత్రిస్తామన్నారు. పైడితల్లి సిరిమానోత్సవం రోజున ఎటువంటి వాహనాలను పట్టణంలోకి అనుమతించబోమన్నారు. అమ్మవారి ఆలయం ఎదురుగా తాత్కాలికంగా కమాండ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నామని  పేర్కొన్నారు.  సిరిమాను తిరిగే ప్రాంతాలను, సిరిమాను తీసుకువచ్చే మార్గంలోనూ, ఇతర ముఖ్య కూడళ్లలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  బందోబస్తు నిర్వహించే పోలీసు సిబ్బందికి బాడీ వార్న్‌ కెమెరాలను ధరింపజేస్తున్నామన్నారు.   భద్రతను నిరంతరం పర్యవేక్షించే విధంగా డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నామన్నారు.   ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా  ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తామన్నారు.  గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఫాల్కన్‌ మొబైల్‌ కమాండ్‌ కంట్రోల్‌ వాహనాన్ని కూడా వినియోగిస్తున్నామన్నారు.   

రూఫ్‌ టాప్‌లు ఏర్పాటు  
సిరిమాను తిరిగే మార్గంలో ముందుగా గుర్తించిన 20 ప్రాంతాల్లో రూఫ్‌ టాప్‌లలో పోలీసులను నియమించి, నిఘా ఏర్పాటు చేశామని, ఇక్కడ విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది బైనాక్యులర్స్‌తో సిరిమాను తిరిగే ప్రాంతాలను పరిశీలిస్తూ, అవసరమైన సమాచారాన్ని కమాండ్‌ కంట్రోల్‌ రూంకు తెలియజేసి పోలీసులను అప్రమత్తం చేస్తారన్నారు.  నేరాలను నియంత్రించేందుకు, నేరస్తులను గుర్తించడంలో అనుభవజ్ఞులైన 200 మంది క్రైం సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసినట్లు  స్పష్టం చేశారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించేందుకు పోలీసు జాగిలాలతో పాటూ, ప్రత్యేక బాంబ్‌ స్క్వాడ్‌ బృందాలను రంగంలోకి దింపుతున్నామన్నారు.  భక్తులకు సహాయ, సహకారాలందించేందుకు పోలీసు సేవాదళ్‌ను ఏర్పాటు చేశామన్నారు. 

ఏడు ప్రత్యేక బృందాలు 
అత్యవసర సమయాల్లో తక్షణమే స్పందించేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలను కమాండ్‌ కంట్రోల్‌ వద్ద సిద్ధంగా ఉంచుతున్నామని, సిబ్బందికి ఎక్కడ ఏ అత్యవసర పరిస్థితి ఎదురైనా, వేరే పోలీసు సిబ్బంది కోసం వేచి చూడకుండా వీరిని వినియోగిస్తామన్నారు.
 
వాహనాల పార్కింగ్‌ ప్రాంతాలు 
అయోధ్య మైదానం, రాజీవ్‌ స్టేడియం, రామానాయుడు రోడ్డు
 
ట్రాఫిక్‌ డైవర్షన్‌ రేపు 
►పట్టణంలోని వాహనాలను ఎత్తుబ్రి డ్జి, సీఎంఆర్‌ జంక్షన్, గూడ్స్‌షెడ్‌ మీదుగా పట్టణం బయటకు తరలిస్తారు.  బాలాజీ జంక్షన్, రామానాయుడు రోడ్డు, సీఎంఆర్‌ జంక్షన్, గూడ్స్‌షెడ్‌ మీదుగా పట్టణం వెలుపలకు పంపిస్తారు. 
►ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్, బాలాజీ, ఆర్టీసీ కాంప్లెక్స్, ఎత్తుబ్రిడ్జి మీదుగా, కొత్తపేట జంక్షన్, దాసన్నపేట, ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్, ధర్మపురి రోడ్డు మీదుగా  బయటకు వెళ్లేందుకు అనుమతిస్తారు. 
►జేఎన్‌టీయూ, కలెక్టరేట్, ఆర్‌అండ్‌బీ, ఎత్తుబ్రిడ్జి, ప్రదీప్‌నగర్‌ మీదుగా, ప్రదీప్‌నగర్‌ జంక్షన్, ధర్మపురి రోడ్డు, ఐస్‌ ఫ్యాక్టరీ జంక్షన్, దాసన్నపేట మీదుగా అనుమతిస్తారు. 

అమ్మ దర్శనం కోసం...
విజయనగరం పూల్‌బాగ్‌: పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. భక్తులెవరూ సిరిమానోత్సవాన్ని నేరుగా దర్శించే అవకాశం లేకుండా టీవీలు, ఎల్‌ఈడీలు ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవం వరకూ ఆగకుండా ముందుగానే అమ్మవారిని దర్శించుకోవాలన్న పిలుపు మేరకు ఇప్పటికే ఘటాలతో ముందస్తుగానే అమ్మకు మొక్కులు చెల్లించుకుంటున్నారు.   

పైడితల్లికి పుష్పార్చన 
పైడితల్లి అమ్మవారు ఆదివారం ప్రత్యేకాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధానార్చకులు దూసి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అర్చకులు బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్, మూలా పాపారావు, ఏడిద రమణ ప్రత్యేక కుంకుమార్చన నిర్వహించారు. ఘటాలతో భక్తులు విచ్చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి  కిశోర్‌కుమార్‌ పర్యవేక్షించారు. 

భక్తజనం 
అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో బారులు తీరారు.  చదురుగుడి నుంచి కోట వరకూ, అటు గంటస్థంభం వరకూ భక్తులు బారులు తీరారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, అత్యంత భద్రంగా... భౌతిక దూరం పాటిస్తూనే అమ్మను దర్శించుకుంటున్నారు. మాస్కులు విధిగా ధరిస్తున్నారు. 

మరిన్ని వార్తలు