ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వెంకటకృష్ణలపై చర్యలు తీసుకోండి

20 Jul, 2021 08:11 IST|Sakshi
నరసరావుపేట రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు

నరసరావుపేట: తాము ఎన్నుకున్న ముఖ్యమంత్రిని అపకీర్తిపాలు చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రేరేపిస్తున్న ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ, ఏబీఎన్‌ న్యూస్‌ చానల్‌ రిపోర్టర్‌ వెంకటకృష్ణలపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ కౌన్సిలర్‌ నెలటూరి మురళి, ఎస్సీ నాయకుడు తలారి నాని రూరల్‌ పోలీసులను కోరారు. ఈ మేరకు సోమవారం రాత్రి వారిద్దరూ ఎస్‌ఐ టి.లక్ష్మినారాయణరెడ్డికి .ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టి ఎంతో ప్రజారంజకంగా పాలన చేస్తున్నారన్నారు. ఆయన అన్ని మతాలు, కులాలు, ఆచారాలు, అభిప్రాయాలను గౌరవిస్తూ అందరికీ ప్రాధాన్యతనిస్తూ పాలన చేస్తున్నారన్నారు.

ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్‌ న్యూస్‌ చానల్‌లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా క్రిస్టియానిటీని అభివృద్ధి చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. గత జూన్‌ 27న ఆంధ్రజ్యోతి మెయిన్‌ ఎడిషన్‌లో ఆర్కే కొత్త పలుకులు పేరుతో జీసెస్‌తో మాట్లాడానని సీఎం అన్నట్లు, తాను దైవదూతనని అధికారులతో చెప్పినట్లుగా ఎలాంటి ఆధారాలు లేకుండా రాశారన్నారు. మతాలను కించపరుస్తూ విద్వేషాలను రెచ్చగొట్టేలా చేస్తున్న రాధాకృష్ణ, వెంకటకృష్ణలపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు