టీకా తీసుకుంటే 'పాజిటివ్'‌ రాదు

20 Apr, 2021 04:03 IST|Sakshi

సామాజిక మాధ్యమాల్లో వచ్చే వాటిని నమ్మొద్దు 

వాట్సాప్‌లో వచ్చే హెల్త్‌ టిప్స్‌ అంతిమం కాదు  

వ్యతిరేక కథనాలను చూసి తమకు అన్వయించుకుంటున్నారన్న మానసిక వైద్యులు 

కోవిడ్‌ వైరస్‌ నుంచి బయటపడటం సమస్య కాదంటున్న నిపుణులు 

సాక్షి, అమరావతి: కోవిడ్‌ టీకా వేసుకుంటే కరోనా పాజిటివ్‌ వస్తుందని రెండ్రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ రెండు వ్యాక్సిన్లలో ఏ ఒక్కటీ ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో పాజిటివ్‌కు దారితీయవని, వ్యాక్సిన్‌ వేసుకుంటే పాజిటివ్‌ రాదని ఏపీ కమాండ్‌ కంట్రోల్‌ అధికారులు ప్రకటించారు. ఇలాంటివి కేవలం పుకార్లు మాత్రమేనని, వీటిని నమ్మద్దని పేర్కొన్నారు. 

ప్రతి చిన్న విషయానికీ ప్రజల్లో కంగారు 
కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రజలు ప్రతి చిన్న విషయానికి కంగారు పడుతున్నట్టు వైద్యుల పరిశీలనలో వెల్లడైంది. జబ్బు తీవ్రత 20 శాతమైతే.. కంగారు వల్ల తలెత్తే మానసిక కుంగుబాటు ప్రభావం 80 శాతం ప్రతికూలంగా పనిచేస్తోందని వైద్యులు చెబుతున్నారు. ప్రతి దానికీ ఆందోళన చెందటం సరికాదని, అప్రమత్తంగా ఉంటే చాలని స్పష్టం చేస్తున్నారు. చాలా కేసుల్లో 40 ఏళ్ల యువతలోనే ఆందోళన కనిపిస్తోందని, వాళ్లు మానసికంగా ఎంతగా ఇబ్బంది పడుతున్నారో దీనివల్ల అర్థమవుతోందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. మానసిక కుంగుబాటు కారణంగా కరోనా నుంచి కోలుకోవడానికి అధిక సమయం పడుతోందని,  కరోనా ఆందోళన పడాల్సిన జబ్బు కాదని స్పష్టం చేస్తున్నారు. 

సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తల ఆధారంగా.. 
చాలామంది సామాజిక మాధ్యమాల్లో వచ్చే హెల్త్‌ టిప్స్‌ను పాటిస్తున్నారు. డాక్టరు సలహా లేకుండా, తీవ్రత తెలియకుండా ఇలా చేయడం వల్ల తీవ్ర నష్టం కలుగుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్‌ లక్షణాలున్నా.. కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్నా దీనికి స్టాండర్డ్‌ ట్రీట్‌మెంట్‌ ప్రొటోకాల్‌ ఉందని, దీనిని పాటించకుండా సోషల్‌ మీడియాలో వచ్చిన వాటిని అనుసరించటం సరికాదని చెబుతున్నారు. కొంతమంది గూగుల్‌లో సెర్చ్‌ చేసి మరీ వివరాలు సేకరించి పాటిస్తున్నారని, ఏమాత్రం అనుసరణీయం కాదని నిపుణులు పదే పదే చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు