ఎంఐజీ ప్లాట్ల బుకింగ్‌కు గడువు పెంపు 

20 Nov, 2022 05:00 IST|Sakshi

డిసెంబర్‌ 31 వరకు దరఖాస్తుకు అవకాశం  

సాక్షి, అమరావతి: మంగళగిరిలోని ‘జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌’లో ప్లాట్ల కొనుగోలు కోసం ఆన్‌లైన్‌లో బుకింగ్‌కు డిసెంబర్‌ 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ–వేలంలో ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు శనివారంతో ముగిసిందని, అయితే, కొనుగోలుదారుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు గడువు పొడిగించినట్లు వివరించారు.

ఇక్కడి ఎంఐజీ లే అవుట్‌–2లో 200 చ.గ. ప్లాట్లు 68, 240 చ.గ. ప్లాట్లు 199, మొత్తం 267 ఉన్నాయని తెలిపారు. చదరపు గజం ధర రూ.17,499గా నిర్ణయించామని, కొనుగోలుదారులకు రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా నివసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు 10% ప్లాట్లు రిజర్వు చేయడంతోపాటు 20% రాయితీ ఇస్తున్నామని, స్థానిక విశ్రాంత ఉద్యోగులకు 5% ప్లాట్లను రిజర్వు చేసినట్లు తెలిపారు.

ఈ–వేలంలో ప్లాట్లు పొందినవారు సులభ వాయిదాల్లో డబ్బులు చెల్లించే సౌకర్యం కూడా ఉందన్నారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ అనంతరం ఈ–వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఎంఐజీలో ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం మరో మంచి అవకాశం కల్పిస్తోందని, ప్లాట్‌ నికర అమ్మకపు ధరలో 60% మీద మాత్రమే రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఉంటాయని, మిగిలిన 40 శాతం మీద మినహాయించినట్లు తెలిపారు. 

పూర్తి వివరాలకు 
https://migapdtcp.ap.gov.in,  https://crda. ap. gov. in వెబ్‌సైట్, లేదా 0866– 2527124 నంబర్‌లో గానీ సంప్రదించవచ్చు.  

మరిన్ని వార్తలు