కారుకు రూ.2 లక్షలు, నెల ఖర్చేమో రూ.3 లక్షలు

22 Mar, 2021 09:34 IST|Sakshi

ఆయుష్‌ కమిషనర్‌ కార్యాలయంలో దుబారా

సాక్షి, అమరావతి: అసలే అంతంత మాత్రం నిధులతో నెట్టుకొచ్చే ఆయుష్‌ విభాగంలో కార్ల నిర్వహణలో జరుగుతున్న దుబారాను అస్సలు పట్టించుకోవడం లేదు. ఆయుష్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఉన్న ఈ పరిస్థితి గత కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారింది. 2006లో కొన్న క్వాలిస్‌ కారును ఇప్పటికీ వాడుతున్నారు. ఆ కారును అమ్మితే ఇప్పుడు రూ.2 లక్షలు కూడా రావు. కానీ దీనికి నలుగురు డ్రైవర్లు, నెలకు 200 లీటర్ల డీజిల్, మరమ్మతులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేలు తదితరాలన్నీ కలిపి దాదాపు రూ.3 లక్షలవుతోంది.

ముగ్గురు ప్రభుత్వ డ్రైవర్లకు ఒక్కొక్కరికీ రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకూ వేతనం ఉంది. ఒక ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌కు రూ.15 వేలు. గతంలో రెండు కార్లుండగా ఒక కారు నెలల తరబడి షెడ్‌లో ఉంది. ప్రస్తుతం నడుస్తున్న క్వాలిస్‌ కారుకు నలుగురు డ్రైవర్లు అవసరం లేదన్నది అక్కడున్న ప్రతి ఒక్కరికీ తెలుసు. నెలకు ఒక కారు వ్యయం వేతనాలతో కలిపి రూ.3 లక్షలంటే ఏడాదికి రూ.36 లక్షలు. డ్రైవర్లు అధికంగా ఉంటే కలెక్టర్‌కు సరెండర్‌ చేస్తే అవసరమున్న చోట వినియోగించుకుంటారు. కానీ గత 15 ఏళ్లుగా ఈ పనిచేయడం లేదు. ఈ నిర్వహణ భారాన్ని చూసి అక్కడి ఉద్యోగులే ముక్కున వేలేసుకుంటున్నారు. 
చదవండి: కోళ్లయందు ‘కడక్‌నాథ్’‌ వేరయా..! 

మరిన్ని వార్తలు