Fact Check: సీతకొండపై బాబు బొంకు!.. అబద్ధాలతో ట్వీట్

20 Apr, 2023 07:32 IST|Sakshi
గతంలో వ్యూ పాయింట్‌ దుస్థితి- అభివృద్ధి చేసిన తర్వాత కళకళలాడుతున్న వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌

అబ్దుల్‌ కలాం పేరును మార్చారంటూ అబద్ధాలతో చంద్రబాబు ట్వీట్

రూ.3.29 కోట్లతో సుందరంగా ‘వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌’ 

విశాఖ జీ 20 సదస్సు సందర్భంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం

నీచ రాజకీయాల్లోకి లాగొద్దంటూ నెటిజన్ల మండిపాటు

సాక్షి, విశాఖపట్నం: నాడు రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలామ్‌కు అవకాశం కల్పించింది తానేనంటూ తరచూ బుకాయించే చంద్రబాబు ఆయన పేరుతో తాజాగా మరోసారి బరి తెగించారు! ఇటీవల విశాఖలో జీ 20 సదస్సు సందర్భంగా బీచ్‌రోడ్డు సీతకొండ సమీపంలోని వ్యూ పాయింట్‌ని సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

అయితే కలాం వ్యూ పాయింట్‌ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చేసిందంటూ చంద్రబాబు ట్వీట్‌ చేయడంపై నెటిజన్లు మండిపడు­తున్నారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు మహనీయుడైన కలాం పేరును వాడుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జనసైన్యం పేరుతో జనసేనకు చెందిన ఓ వ్యక్తి బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో పోస్ట్‌ చేసిన ట్వీట్‌ను కొద్దిగా మార్చి ఇంగ్లీష్‌లో చంద్రబాబు మధ్యాహ్నం ట్వీట్‌ చేశారు.

ఇక్కడ కూడా కాపీ, పేస్ట్‌లో చంద్రబాబుని మించినవారు లేరంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. సీతకొండ ఎదురుగా ఖాళీ స్థలం నుంచి సముద్రం అద్భుతంగా కనిపిస్తుంది. స్థానికులు దశాబ్దాలుగా దీన్ని సీతకొండ వ్యూ పాయింట్‌గానే వ్యవహరిస్తున్నారు. తాము 30 ఏళ్లుగా విశాఖలోనే ఉంటున్నామని, వ్యూ పాయింట్‌ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. 

రూ.3.29 కోట్లతో వ్యూ పాయింట్‌ అభివృద్ధి
సుందర విశాఖ సాగర తీరంలో సరైన వ్యూ పాయింట్స్‌ లేకపోవడంతో జీ 20 సదస్సు సందర్భంగా సీఎం జగన్‌ ఆదేశాల మేరకు జోడుగుళ్ల పాలెం సమీపంలోని ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చారు. చక్కటి పెయింటింగ్స్‌ ఏర్పాటు చేశారు. నడక దారితోపాటు మార్బుల్స్‌తో కూర్చునే బెంచీలు, లవ్‌ వైజాగ్‌ చిహ్నం తదితరాలతో తీర్చిదిద్ది వైఎస్సార్‌ వ్యూ పాయింట్‌గా నామకరణం చేశారు.

మరిన్ని వార్తలు