Fake Challan Scam: ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు

18 Aug, 2021 19:23 IST|Sakshi

సాక్షి,అమరావతి: రాష్ట్రంలో నకిలీ చలానాల కుంభకోణంపై రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు విచారణ వేగవంతం చేశారు. ఈ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న ఏడుగురు సబ్ రిజిస్ట్రార్లపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ అక్రమాలపై తొమ్మిది క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు భవిష్యత్ లో ఈ తరహా అక్రమాలకి చోటు లేకుండా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు. మరోవైపు నకిలీ చలానాల కుంభకోణంపై రెండు రోజులలో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాదికారులు నివేదిక ఇవ్వనున్నారు. అత్యధికంగా కృష్ణా జిల్లాలో సమారు రూ.3 కోట్ల వరకు స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించారు.ఆ తర్వాత కడప జిల్లాలో కోటి రూపాయిలకి పైగా స్కామ్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో అక్రమార్కులపై చర్యలతో పాటు రికవరీపై దృష్టి సారించి ఇప్పటి వరకు 50 శాతం వసూలు చేశామని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కమీషనర్ ఎంవి శేషగిరిబాబు తెలిపారు. రాష్డ్ర వ్యాప్తంగా మొత్తం 17 రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఈ అక్రమాలు బయటపడ్డాయి...ఈ నేపధ్యంలో గత నాలుగు రోజులగా అధికారులు ఆయా కార్యాలయాలలో 65 లక్షల రిజిస్టర్డ్ డాక్యుమెంట్లని తనిఖీ చేయగా 30 వేల డాక్యుమెంట్లలో నకిలీలని గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో  ఉన్నతాధికారులు అక్రమార్కులపై చర్యలకి ఉపక్రమించారు. ఈ అక్రమాలపై పూర్తిస్ధాయిలో దర్యాప్తుకి కమీషనర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్స్ అదనపు ఐజి ఆద్వర్యంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసారు.

చదవండి:రిజిస్ట్రేషన్ల నకిలీ చలానాల వ్యవహారం.. మరో రూ.40 లక్షలు రికవరీ

మరిన్ని వార్తలు