‘శ్రీవారి దర్శనం’పై అసత్య కథనాలు హేయం

19 Dec, 2021 05:14 IST|Sakshi

హిందూ ధర్మ వ్యాప్తికి, గో సంరక్షణకు టీటీడీ అవిశ్రాంత కృషి

భక్తులను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు

తిరుమల: భక్తులను టీటీడీ కులాలవారీగా విభజించి తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని భారత్‌ మార్గ్‌ అనే యూట్యూబ్‌ చానల్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని టీటీడీ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించింది. లాక్‌డౌన్‌ సమయంలో 21 రోజులపాటు శ్రీవారికి నైవేద్యం సమర్పించలేదని ఆ చానల్లో ఆరోపించడం పూర్తిగా అవాస్తవమని టీటీడీ స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో కేవలం భక్తులకు దర్శనాలు రద్దు చేశారే తప్ప, స్వామికి పూజలు, నైవేద్యాలు యథాతథంగా కొనసాగాయని వివరించింది.

సనాతన హిందూ ధర్మాన్ని వ్యాప్తి చేసి, మత మార్పిడులను అరికట్టేందుకు సమరసత సేవా ఫౌండేషన్‌ సహకారంతో 2021 అక్టోబరు 7 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని వెనుకబడిన, మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకారులను ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి బ్రహ్మోత్సవ దర్శనం కల్పించినట్లు వెల్లడించింది. ఇదే తరహాలోనే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకుందని వివరించింది.

టీటీడీ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లను పోషిస్తోందని, జెరూసలేం, హజ్‌ యాత్రలకు నిధులు అందిస్తోందనడం పూర్తి అవాస్తవమైన ఆరోపణగా టీటీడీ కొట్టిపారేసింది. గోసంరక్షణకు టీటీడీ అవిశ్రాంతంగా కృషి చేస్తోందని, ఇందులో భాగంగా తిరుపతి, పలమనేరు గోశాలల్లో దేశవాళీ ఆవుల సంరక్షణతోపాటు వాటి సంతతిని పెంచేందుకు అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపింది. వాస్తవాలు ఇలా ఉంటే.. భక్తులను తప్పుదోవ పట్టించే విధంగా అసత్య ఆరోపణలు చేయడం, తప్పుడు వార్తలు ప్రసారం చేయడం తగదని సూచించింది. ఈ విధంగా దుష్ప్రచారం చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది.  

మరిన్ని వార్తలు