రైతు భరోసా పెద్ద వరం

28 Oct, 2020 03:08 IST|Sakshi
రావుల ప్రసాద్, కరప మండలం, తూర్పుగోదావరి జిల్లా

జీవనాధారమైన సాగును మీరు పరిపుష్టం చేస్తున్నారు 

సీఎం జగన్‌తో రైతు భరోసా లబ్దిదారుల మనోగతం

భగవంతుడే మీ రూపంలో వచ్చాడు

రైతు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నవాడే దేవుడు. ఇప్పుడు భగవంతుడే మీ రూపంలో వచ్చాడు. గతంలో వ్యవసాయం ఎందుకు చేస్తున్నామా అనిపించేది. మీరు సీఎం అయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిజంగా వ్యవసాయం అంటే పండుగగా మార్చారు. ఈ సంవత్సరం జగనన్న నామ సంవత్సరం. ఇన్‌పుట్‌ సబ్సిడీ, రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా ఎంతో మేలు జరుగుతోంది. వరికోత యంత్రాలను రైతు భరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచాలి. డ్రైన్లు ఆక్రమణలపై దృష్టి పెట్టాలి. ప్రతీ రైతు మీ వెనకే ఉన్నాడు. (సీఎం జోక్యం చేసుకుంటూ ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోని ఆర్బీకేల్లో వరికోత యంత్రాలు అందుబాటులో ఉండేలా చూస్తామన్నారు. డ్రైన్స్‌ ఆధునికీకరణ చేస్తామన్నారు.)  
– రావుల ప్రసాద్, కరప మండలం, తూర్పుగోదావరి జిల్లా

సాక్షి, అమరావతి: ‘రైతు భరోసా పథకం రైతులకు పెద్ద వరం లాంటిది. మా జీవనాధారమైన సాగును మీరు (సీఎం) పుష్కలం చేస్తున్నారు. పంట దెబ్బతిన్న సీజన్‌లోనే పరిహారం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్బీకేల్లో రైతులకు అవసరమైనవన్నీ ఇవ్వడం సంతోషంగా ఉంది’ అని పలువురు రైతులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద రెండో ఏడాది రెండో విడత పెట్టుబడి సాయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల్లోని రైతులు ముఖ్యమంత్రితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..

ఆర్బీకేలు రైతుల దేవాలయాలు
ఖరీఫ్, రబీ సీజన్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఆయా సీజన్లలోనే ఇస్తామనడం చాలా సంతోషదాయకం. దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇందుకు మీకు ధన్యవాదాలు. రైతు భరోసా అనేది రైతులకు పెద్ద వరం. రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట దేవాలయాలు. వాటి వల్ల ఎంతగానో ఉపయోగం ఉంటోంది. మాకు కావాల్సిన పురుగు మందులు, ఎరువులు అన్నీ అక్కడే దొరుకుతున్నాయి. కాల్‌ సెంటర్‌ 155251 ద్వారా మాకు ఎన్నో సలహాలు అందుతున్నాయి. కలకాలం మీరే ముఖ్యమంత్రిగా ఉండాలి.
    – చంద్రశేఖర్, రైతు, కర్నూలు 

ఆజన్మాంతం రుణపడి ఉంటాం 
పాదయాత్రలో మీరు రైతుల కష్టనష్టాలు కళ్లారా చూశారు. ఇప్పుడు అన్ని విధాలా ఆదుకుంటున్నారు. రైతు భరోసా ద్వారా వ్యవసాయంపై ఆసక్తి పెరుగుతోంది. వేసవి దుక్కులకు, వరినార్లు్ల పోసుకునేందుకు మే నెలలో రూ.7,500 ఇచ్చారు. ఇప్పుడు కోతల సమయంలో రూ.4 వేలు అందిస్తున్నారు. రైతు భరోసా కేంద్రం ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. మాకు జీవనాధారమైన సాగును పుష్కలం చేస్తున్నందుకు మీకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం.    
    – అల్లు సూర్యనారాయణ, ధర్మవరం, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం 

పంట పరిహారం అదే సీజన్‌లో అందించడం సంతోషం 
ఇన్‌పుట్‌ సబ్సిడీ అనేది ఇదివరకు ఎప్పుడో ఏళ్ల తర్వాత వచ్చేది. ఒక పంట నష్టపోతే అదే సీజన్‌లో పరిహారం అందించడమనేది గర్వించతగ్గ విషయం. మొన్న ఆగస్టు నెలలో పెసర, మినప పంటలు వేసి నష్టపోయిన నాతో పాటు నా తోటి రైతులందరికీ 60 రోజులు కాకముందే హెక్టారుకు రూ.10 వేలు చొప్పున డబ్బులు అందాయి. చాలా సంతోషంగా ఉంది. రైతు భరోసా కౌలు రైతులకు కూడా వర్తింప చేయడం గొప్ప విషయం.      
– వెంకటసుబ్బారావు, దండేపల్లి, కంచికచర్ల, కృష్ణా  

మరిన్ని వార్తలు