కరుణలేని కరోనా.. కొడుకు మృతితో తండ్రికి గుండెపోటు

26 Apr, 2021 13:00 IST|Sakshi
మృతులు రాజారావు, సుబ్బారావు (ఫైల్‌) 

పండంటి కుటుంబాన్ని కకావికలు చేసిన కరోనా

మాకవరపాలెం (నర్సీపట్నం): మరికొద్దిరోజుల్లో వివాహ వేడుకతో సంతోషంగా గడపాల్సిన ఆ కుటుంబాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. కరోనాతో కొడుకు మృతి చెందడంతో ఈ వార్తను తట్టుకోలేని తండ్రి గుండెపోటుతో మరణించారు. మాకవరపాలెం మండలం  తామరంలో ఈ  ఘటన జరిగింది. గ్రామానికి చెందిన ముళ్లపూడి రాజారావు (దర్మి) (58) ఇదే గ్రామంలోని ప్రాథమి క పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

వారం రోజుల కిత్రం జ్వరం రావడంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్‌ వచ్చింది. విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మరణించారు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి సుబ్బారావు (86) మధ్యాహ్నం 3 గంటలకు గుండెపోటుతో మృతిచెందారు. ఒకే రోజున తండ్రీ కొడుకులు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. సుబ్బారావు కూడా సుదీర్ఘకాలం ఉపాధ్యాయునిగా పనిచేశారు.

మే 13న మనుమడి వివాహం.. 
ఉపాధ్యాయుడు రాజారావుకు కొడుకు, కూతురు ఉన్నారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న కొడుకు పవన్‌కుమార్‌కు వివాహం నిశ్చయం కావడంతో మే 13న రాజమండ్రిలో వివాహం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ పెళ్లి కోసమే 20 రోజుల కిత్రం విశాఖలో దుస్తులు కొనుగోలు చేసేందుకు వెళ్లి వచ్చిన అనంతరం రాజారావుకు జ్వరం వచ్చిందని, పరీక్ష చేయించగా కరోనా పాజిటివ్‌ వచ్చిందని కుటుంబీకులు చెబుతున్నారు. మరికొద్ది రోజుల్లో వివాహ వేడుక జరగనున్న నేపథ్యంలో తండ్రీ కొడుకులు మరణించడం అందరినీ కలచివేసింది.

చదవండి: మృత్యువులోనూ వీడని బంధం, అరగంట వ్యవధిలో..   
కంటతడి పెట్టించిన హృదయ విదారక దృశ్యం..

మరిన్ని వార్తలు