కన్నీళ్లు తెప్పించే ఘటన.. ఎమ్మిగనూరులో తండ్రి.. హైదరాబాద్‌లో కొడుకు..

10 Nov, 2022 18:58 IST|Sakshi
మాదేష్, జగదీష్‌ (ఫైల్‌)

ఎమ్మిగనూరు రూరల్‌ (​కర్నూలు జిల్లా): తండ్రి మరణించిన కొన్ని గంటల వ్యవధిలోనే కుమాడురు మృతి చెందాడు. దీంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాలు..ఎమ్మిగనూరు పట్టణం ఎస్‌ఎంటీ కాలనీకి చెందిన మాదేష్‌(65), బేబిలు రాళ్లు కొట్టి జీవనం సాగిస్తున్నారు. వీరికి జగదీష్‌ (32) ఒక్కడే సంతానం. కొన్ని సంవత్సరాల క్రితం జగదీష్‌కు రాధతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

హైదరాబాద్‌లో సెంట్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే జగదీష్‌ గత నెల 25వ తేదీన ఎమ్మిగనూరుకు వస్తూ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కుమారుడికి ప్రమాదం జరిగినప్పటి నుంచి తండ్రి మాదేష్‌ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు.

కుమారుడికి ఆపరేషన్‌ చేస్తుండడంతో హైదరాబాద్‌కు వెళ్లిన మాదేష్‌ భార్య బేబి విషయం తెలుసుకుని మధ్యాహ్నం ఎమ్మిగనూరుకు చేరుకుంది. తండ్రి అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చేస్తుండగా బీపీ, షుగర్‌ పెరిగి జగదీష్‌ మృతి చెందాడు. భర్త మృతదేహాన్ని తీసుకుని అంబులెన్స్‌తో భార్య రాధ ఒక్కటే ఎమ్మిగనూరు వచ్చింది. ఒకే రోజు తండ్రి, కుమారుడు మృతి చెందటంతో ఎమ్మిగనూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
చదవండి: భర్తతో విడాకులు.. ఇంటి పనికి వెళ్లి వస్తానని చెప్పి..


 

మరిన్ని వార్తలు