తల్లి కళ్లుగప్పి బిడ్డను అమ్మేసిన కసాయి తండ్రి

30 Aug, 2020 20:36 IST|Sakshi

సాక్షి, కృష్ణా: జిల్లాలోని ముసునూరు మండలం వలసపల్లిలో అమానవీయ ఘటన చోటుచేసుకొంది. భార్య కళ్లుగప్పి ఓ భర్త కన్న కూతురిని అమ్మేశాడు. వివరాలు.. నవీన్‌బాబు అనే వ్యక్తి ఆడపిల్లలు పుడుతున్నారని తన తల్లిదండ్రులతో కలిసి భార్య రజనీని చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈక్రమంలోనే మరోసారి తీవ్రంగా కొట్టడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఇదే అదనుగా భావించిన నవీన్‌బాబు నాలుగో కూతురిని లక్షా 50 వేల రూపాయలకు అమ్మేశాడు. అయితే, డబ్బుల పంపిణీలో నవీన్‌బాబుకు అతని తల్లిదండ్రులకు మధ్య వాగ్వివాదం జరగటంతో విషయం బయటపడింది.

గాయాల నుంచి కోలుకున్న రజనీ తన బిడ్డ ఎక్కడనీ భర్త, అత్తమామలను నిలదీసింది. దీంతో వారంతా కలిసి మరోసారి రజనీపై దాడి చేసి హత్యాయత్నం చేశారు. వారి బారి నుంచి తప్పించుకున్న రజనీ తన తల్లి దండ్రులతో కలిసి బిడ్డ అమ్మకంపై ముసునూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, న్యాయం చేస్తాడనుకున్న ముసునూరు ఎస్‌ఐ మరోలా చేశాడు. బిడ్డను కొన్న దంపతులను స్టేషన్‌కి పిలిపించి తల్లి రజనీతో ఫొటోలు తీయించి తిరిగి వారికే అప్పగించాడు. ఎస్ఐ తీరుపై రజనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తన బిడ్డను ఇప్పించాలని బాధితురాలు నూజివీడు ఎమ్మెల్యేని ఆశ్రయించింది.
(చదవండి: నకిలీ పోలీసుల గుట్టురట్టు)

మరిన్ని వార్తలు