ఆస్పరి: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం కైరుప్పల గ్రామంలో ఆదివారం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి పిడకలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. పిడకల సమరాన్ని (నుగ్గులాట) చూడటానికి ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అరగంట పాటు జరిగిన పిడకల సమరంలో సుమారు 50 మంది గాయపడ్డారు. వారందరికీ స్థానికంగా చికిత్స చేయించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.