ప్రత్యేక కేటాయింపుల్లేవు

2 Feb, 2021 03:53 IST|Sakshi

సీఎం జగన్‌కు వివరించిన ఆర్థిక శాఖ అధికారులు 

కేటాయింపుల నుంచి వీలైనన్ని నిధులు రాబట్టాలని సీఎం ఆదేశం

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన కారణంగా అనేక రంగాల వారీగా, మౌలిక సదుపాయాల రూపేణ భారీ నష్టం ఏర్పడిందని, ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌ పట్ల ఆశగా చూశామని, అయినా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ చేయలేదని ఆర్థిక శాఖ అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 2021–22 సంవత్సరానికి సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో సీఎం జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు.

వివిధ రంగాల వారీగా బడ్జెట్‌ కేటాయింపుల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాలతో సమాన స్థాయిలో రాష్ట్రానికి బడ్జెట్‌ కేటాయించలేదన్నారు. వివిధ రంగాలకు అన్ని రాష్ట్రాల తరహాలోనే ఏపీకి వస్తాయి తప్ప, రాష్ట్రానికి ప్రత్యేకించి ఏమీ లేవని పేర్కొన్నారు. పీఎం కిసాన్, పీఎం ఆవాస్‌ యోజన, ఉపాధి హామీ పథకాలకు గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు తగ్గాయని.. ఆహారం, పెట్రోల్, ఫెర్టిలైజర్స్‌ సబ్సిడీలను కూడా తగ్గించారని నివేదించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ స్పందిస్తూ.. కేంద్ర బడ్జెట్‌లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపుల్లో వీలైనన్ని నిధులను రాష్ట్రానికి తీసుకు రావడానికి అధికారులు గట్టి ప్రయత్నాలు చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో సంప్రదింపులు జరిపి సకాలంలో నిధులు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు