మాస్క్‌ లేకుండా తిరిగితే రూ.100 జరిమానా

21 Apr, 2021 04:15 IST|Sakshi

5 అడుగుల భౌతిక దూరం పాటించాలి

స్విమ్మింగ్‌ పూల్స్‌ అన్నీ మూసివేయండి: ప్రభుత్వం ఆదేశం 

సాక్షి, అమరావతి: కరోనా రోజురోజుకూ వ్యాప్తి చెందుతోంది. అయినా సరే చాలామంది ఇప్పటికీ మాస్కు లేకుండా తిరుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో మాస్కు లేకుండా ఎవరైనా బయట తిరిగితే వారికి రూ.100 జరిమానా విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డుపైకి ఎవరైనా మాస్కు లేకుండా వస్తే జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు.

షాపులు లేదా వ్యాపార సంస్థలు, కమర్షియల్‌ కాంప్లెక్సుల్లో 5 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, షాపింగ్‌ మాల్స్, సినిమా హాళ్లు వంటి చోట సీటు మార్చి సీటు అంటే మధ్యలో సీటు ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి షాపులో, ఇతర చోట్లా శానిటైజర్‌ వేసుకున్న తర్వాతే వినియోగదారులను లోపలికి పంపించాలని ఆదేశించారు. థర్మల్‌ స్క్రీనింగ్‌ మెషీన్లను విధిగా వాడాలని పేర్కొన్నారు. స్విమ్మింగ్‌ పూల్స్‌ అన్నీ వెంటనే మూసివేయాలని ఆదేశాలిచ్చారు. పైన నిబంధనలు అమలు చేయడానికి జిల్లా కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇచ్చారు. 

మరిన్ని వార్తలు